చిట్యాల, నవంబర్ 6: ప్రజలు విజ్ఞతతో ఆలో చించి సరైనా నిర్ణయం తీసుకోవాలని, నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఓటు వేసి గెలిపించాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మండలంలోని నేరడ, ఎలికట్టె గ్రామాల్లో సోమవారం ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులను చూసి ఓటు వేస్తే ఇక్కడ అభివృద్ధ్ది కుంటుపడుతుందని, అరాచకం రాజ్యమేలుతుందని అన్నారు.
సొంత లాభం కోసం కాకుండా అభివృద్ధ్ది, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందిని చూడలేకనే తాను పార్టీ మారానని ప్రజలకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తూ వందల కోట్ల నిధులను తీసుకువచ్చిన ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేశానని వివరించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనను ఓడించాలని కక్షగట్టి అక్రమ వలసలకు తెరతీస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఎన్ని డబ్బులు వెదజల్లినా నకిరేకల్లో బీఆర్ఎస్దే విజయమన్నారు. కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ మర్ల అలివేలూరాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, ఎలికట్టె సర్పంచ్ ఉయ్యాల సత్తయ్య, ఎంపీటీసీ గొలనుకొండ దశరథ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు కల్లూరి మల్లారెడ్డి, నాయకులు కొలను వెంకటేశ్, సన్యాసిరావు పాల్గొన్నారు.
నార్కట్పల్లి కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలకు ప్రజలు మోసపోయి గోసపడొద్దని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కొండపాకగూడెం గ్రామంలో సోమవారం ఇంటింటికీ వెళ్లి ఓటును అభ్యర్థ్దించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లెంలలో ఉదయ సముద్రం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిందన్నారు. ప్రాజెక్టు ట్రైలర్ రన్ విజయవంతం కావడంతో సంతోషంగా ఉందని లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని అన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్ సీఎంగా కేసీ ఆర్ను, మూడోసారి తనను ఎమ్మెల్యేగా తెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా పని చేస్తున్నానని ప్రతీ గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధ్ది పనులు చేశానని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఏదో రకంగా ప్రభుత్వ సంక్షేమం అందుతుందని అన్నారు. ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోస్తున్న రైతులతో కాసేపు ముచ్చటించారు. అకాల వర్షం సంభవించక ముందే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.