సూర్యాపేట, ఫిబ్రవరి 3 : కృష్ణా జలాలపై హక్కులు రాష్ర్టానికే ఉండాలని, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం తగదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన శనివారం జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు జరుగుతున్న అన్యాయంపై సభ్యులతోపాటు ఎంపీ లింగయ్యయాదవ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కృష్ణా రివర్ మేనెజ్మెంట్ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జల్శక్తికి అప్పగించడం సరికాదన్నారు. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా తీవ్ర అన్యాయానికి గురవుతుందని, ఉమ్మడి జిల్లా ఎడారి అయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు.
గతంలో ఈ కుట్రలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు తిప్పికొట్టారని గుర్తు చేశారు. జల్శక్తి నిబంధనల ప్రకారం నాగార్జున సాగర్, శ్రీశైలం జలాలపై తెలంగాణకు హక్కు లేకుండా పోతుందన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే పార్లమెంట్లో గొడవ చేశారన్నారు. దొడ్డిదారిన తెలంగాణ హక్కులను గుంజుకున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని సూచించారు. మన రాష్ట్రం.. మన ప్రాజెక్టు, మన హక్కు అని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని కోరగా సభ్యులు మద్దతు పలికారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు రైతులకు అందించే రైతు బంధు ఇవ్వలేకపోయారని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో మూడెకరాల రైతులకు మాత్రమే రైతుబంధు వచ్చిందన్నారు. ఇంకా 80వేల మంది రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉన్నదని, ఎప్పుడు వేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని, కరెంటు బిల్లులు కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయవద్దని, చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
గత ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఏరియా ఆసుపత్రి స్థాయిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసిందని జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ అన్నారు. ఆ ప్రకారం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన నివేదికలు తయారు చేసి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకుపోతే త్వరగా పోస్టుమార్టం చేయడం లేదని జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందిని నియమించాలని కోరారు. కార్మిక శాఖ అధికారిపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు వచ్చే బెన్ఫిట్స్ దళారులు తీసుకొస్తేనే పనిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలిసారిగా జరిగిన జడ్పీ సమావేశానికి జిల్లా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, మందుల సామెల్ హాజరు కాలేదు. జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మంత్రి హాజరవుతారని ఎదురు చూసిన సభ్యులు నిరాశకు గురయ్యారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం రాకపోవడం నిరాశకు గురిచేసిందని సభ్యులు పేర్కొన్నారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, గోదావరి జలాలు చివరి ఆయకట్టుకు రావడం లేదని, కృష్ణా బెల్ట్లో నీళ్లు లేక చెరువులు ఎండిపోవడం, బోర్లు పోయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని సభ్యులు తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, జడ్పీ సీఈఓ సురేశ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.