సూర్యాపేట పట్టణంలో రోడ్లన్నీ సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున బీటీ, సీసీ రోడ్లు వేయగా అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు వేసేందుకు భారీగా నిధులు మంజూరయ్యాయి. 48 వార్డులకు రూ.11.05 కోట్లు విడుదల కాగా ఒక్కో వార్డుకు రూ.20 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పది రోజులపాటు ప్రతి వార్డులో మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
సూర్యాపేట, మే 16 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట రహదారులకు మళ్లీ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఇప్పటికే వందల కోట్లు వెచ్చించి గల్లీగల్లీకి సీసీ, బీటీ రోడ్లు వేయగా తాజాగా పట్టణంలోని 48 వార్డుల్లో వార్డుకు కనీసం రూ.20 లక్షలు తగ్గకుండా రూ.11.05 కోట్లతో 52 రహదారులను వేస్తున్నారు. ఈ పనులకు సంబంధించిన శంకుస్థాపనలను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైనే గుంతలు లేని రహదారులు నిర్మాణం కాగా ప్రస్తుత నిధులతో చేసే పనుల తర్వాత 50 శాతం వార్డుల్లో నిధులు ఉన్నా రోడ్డు వేసేందుకు అవకాశం ఉండదు. ప్రధానంగా గతంలో పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లాలన్నా సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నియోజకవర్గ కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు సైతం అద్వానంగా ఉండేవి. మోకాళ్ల లోతు గుంతలు, అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంత్రి సూర్యాపేటలోని రోడ్లన్నింటినీ అద్దంలా తయారు చేశారు. నిధులను భారీగా తీసుకువచ్చి 90 శాతం మేర రోడ్లను పూర్తి చేయించారు.
మంత్రి చొరవతో..
సూర్యాపేట మున్సిపాలిటీలో ఇంకా కొన్ని మిగిలి ఉన్న రోడ్లతో పాటు గత పాలనలో వేసిన రోడ్లకు గుంతలు పడడంతో వాటిని కొత్తగా నిర్మించేందుకు మంత్రి చొరవ చూపి మున్సిపల్, పల్లె ప్రగతి నిధులు రూ.11.05 కోట్లు వెచ్చించారు. శంకుస్థాపనల కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కాగా 25 వరకు కొనసాగనుంది. గత తొమ్మిదేళ్లుగా పట్టణంలో గుంతల రోడ్లు పోయి సీసీ, బీటీ రోడ్లు రావడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.