మండు వేసవిలోనూ జలకళ
పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు.. ప్రస్తుతం 643
రూ. 20 కోట్ల ఆధునీకరణ పనులతో నీటి లీకేజీలకు చెక్
రైతన్న హర్షం
సూర్యాపేట, జూన్ 4(నమస్తే తెలంగాణ) : సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందించే మూసీ ప్రాజెక్టు సొంత రాష్ట్రంలో మహర్దశను సంతరించుకున్నది. ఆయకట్టు రైతాంగానికి సంతోషాల పంటలు పంచుతున్నది. మూసీ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోకపోవడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్లే లీకేజీల రూపంలో దిగువకు వెళ్లేవి. దీంతో ఏడాదిలో ఒక్క పంటకు కూడా 16 వేల ఎకరాలకు మించి ఏనాడూ నీరందలేదు. ప్రస్తుతం జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 20 కోట్లు మంజూరు చేయగా ప్రాజెక్టుకు గేట్లు కొత్తవి అమర్చారు. దీంతో గత మూడేళ్లుగా డ్యామ్ లీకేజీలు ఆగిపోవడం, జలాశ యం నిండుతుండడడంతో రెండు పంటలకు సరిపడా నీళ్లందుతున్నాయి. ప్రస్తుతం ఏడాదిలో ప్రతి కారు 40వేల ఎకరాల్లో భూమి సాగవుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో మూసీ ప్రాజెక్టు రికార్డులు సృష్టిస్తుండగా అన్ సీజన్లో మండుటెండలో సైతం జలకళను సంతరించుకుని తొమ్మిదేళ్ల రికార్డును నమోదు చేసింది.
మండు వేసవిలో జలాశయంలో 4 టీఎంసీల నీరు
గత తొమ్మిదేళ్లుగా మే, జూన్ మాసాల్లో మూసీ ప్రాజెక్టులో జలం 0.26 టీఎంసీలకు అడుగంటిపో యేది. అయితే గతేడాది మేలో 2.43 టీఎంసీల నీరుండగా ప్రస్తుతం 4.4 టీఎంసీలకుగాను 4 టీఎంసీలు ఉండడం విశేషం. డ్యామ్ నిర్మించిన తరువాత మెయింటెనెన్స్, మరమ్మతుల కోసం నాటి ప్రభుత్వాలు నయాపైసా ఇవ్వలేదు. దీంతో నదిలోకి వచ్చిన నీళ్లు వచ్చినట్లే దిగువకు వెళ్లి సముద్రం పాలయ్యేవి. అలాంటిది 2014లో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సూర్యాపేట నుంచి విజయం సాధించిన గుంటకండ్ల జగదీశ్రెడ్డి మంత్రి కావడం, విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి రూ.20 లక్షలు మంజూరు చేయించడంతో డ్యామ్ ఆధునీకరణ పూర్తయింది. దీంతో లీకేజీలు నిలిచిపోయాయి.
బిక్కేరు వాగు నుంచి నీటి చేరిక
దీనికి తోడు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించడంతో మూడేళ్లుగా గోదావరి జలాలు సైతం పరవళ్లు తొక్కు తున్నాయి. దీంతో ఎగువన వరంగల్ బిక్కేరు వాగు నుంచి మూసీకి ఇన్ఫ్లో పెరిగి నీరు చేరుతున్నది. అలాగే హరితహారంతో మొక్కలు పెంచు తుండడంతో సకాలంలో వర్షాలు కురుస్తుండడం విధితమే. ఈ విధంగా రెండేళ్లుగా మూసీ జలకళను సంతరించుకుంటుండగా ప్రస్తుతం రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరింది. దీంతో భవిష్యత్తులో నీటి ఇక్కట్లు ఉండవంటూ ఆయకట్టు రైతాంగం హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తున్నారు.
మూసీకి జలకళ రికార్డే
చాలా ఏండ్లుగా మే, జూన్ మాసాల్లో మూసీ ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయేవి. గతేడాది నుంచి మూసీకి వేసవిలోనూ నీళ్లు వచ్చి చేరుతున్నాయి. డ్యాంకు లీకేజీలు లేకపోవడంతో పాటు శ్రీరాంసాగర్ ఆయకట్టు జలకళను సంతరించుకోవడంతో దాదాపు ప్రతి రోజూ బిక్కేరు వాగు నుంచి ఇన్ ఫ్లో ఉంటున్నది. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరి కళకళలాడుతున్నది.
–చంద్రశేఖర్, మూసీ ప్రాజెక్టు డీఈ
మూసీ నిండటం ఇదే మొదటిసారి
గతంలో ప్రతి వేసవిలో మూసీ జలాశయం మొత్తం ఎండిపోయేది. కేవలం వానకాలంలో కురిసిన వర్షాలకు మాత్రమే ప్రాజెక్టు నిండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కాళేశ్వరం జలాలతో మే, జూన్ నెలల్లో సైతం గోదావరి నీటితో నింపారు. దీంతో మూసీ ప్రాజక్టు నిండుకుండలా జలకళ సంతరించుకున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి.
– కుంట్ల సుదర్శన్రెడ్డి, ఎండ్లపల్లి, శాలిగౌరారం మండలం
ఆయకట్టు రైతులకు ఏ ఇబ్బంది లేదు..
నాకు పెన్పహాడ్ మండలం అనాజీపురం శివారులో మూసీ చివరి ఆయకట్టు కింద 2.12 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. గత ఆరేండ్లలో ఆ భూమిలో ఏనాడు వరి పండించలేదు. ఆరుతడి పంటలకు అప్పుడప్పుడూ వచ్చే మూసీ నీటి కోసం రైతులం గొడవ పడేవాళ్లం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కొద్ది సంవత్సరాలకే మూసీ నీళ్లు పరవళ్లు తొక్కుతు న్నాయి. దీంతో ఇప్పుడు రెండు కార్లు వరి సాగు చేస్తున్నా. గత ఏడాది షటర్ రిపేర్ ఇబ్బంది ఉండగా మంత్రి జగదీశ్రెడ్డి చొర వతో బాగుపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్లోనే మూసీ నిండిందంటే నమ్మలేక పోతున్నా. ఇప్పుడు ఆయకట్టు రైతులకు ఏబాధ లేదు.
– ఒంటెద్దు ఆదర్శరెడ్డి, మూసీ చివరి ఆయకట్టు రైతు, అనంతారం, పెన్పహాడ్ మండలం