నల్లగొండ, జూలై 26 ; బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉన్నది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 72.3, యాదాద్రి జిల్లా మోత్కూరులో 45.8, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో 40.3 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రోజంతా వర్షం పడడంతో వరద పోటెత్తుతున్నది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. మూసీతోపాటు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మూసీ ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో చెరువులు, కుంటలు 50-80 శాతం నిండి జలకళ సంతరించుకున్నాయి. 60 చెరువుల వరకు అలుగు పోస్తున్నాయి. వరద ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సీఎస్ శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ వర్షం, వరదలపై జిల్లాలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. వరద ప్రాంతాల్లో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ ఎస్పీ కె.అపూర్వరావు సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వరుస వర్షాలు ఆగడం లేదు. వారం రోజుల క్రితం షురూ అయిన వాన కొనసాగుతూనే ఉన్నది. ఉదయం కాస్త తెరిపినిస్తున్నా మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో వరద పెరిగి చెరువుల్లోకి చేరుతున్నది. గడిచిన వారం రోజుల్లో వంద చెరువలకు పైగా నిండుకుండల్లా మారి తొణికిసలాడుతుండటంతోపాటు భూగర్భజలాలు పెరుగుతున్నాయి. వరి సాగు చేసే రైతులకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం పత్తికి నష్టం తప్పేలా లేదు. బుధవారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం కురువగా ఇప్పటి వరకు 7 శాతం వర్షపాతం అదనంగా నమోదైంది.
చెరువుల్లోకి చేరుతున్న వరద..
వానకాలం సీజన్ ఆరంభంలో దోబూచిలాడిన వరణుడు మందగమనాన్ని వీడి వర్షిస్తుండటంతో జిల్లాలో వర్షపాతం పెరిగింది. దాంతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. నాగార్జున సాగర్లో నీటి నిల్వలు సరిగ్గా లేకపోవటంతో జిల్లాలో చెరువులకు నీటి విడుదల ఆగినందున వాటిల్లో నిల్వలు తగ్గాయి. అయితే జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వానతో చెరువుల్లోకి నీరు చేరింది. ఈ నెల 18న 95 చెరువుల్లో 50 శాతం ఉన్న నీటి నిల్వలు బుధవారం నాటికి 80 చెరువులు వంద శాతం నీటి నిల్వలకు చేరుకోగా, 15 చెరువుల్లో నిల్వలు ఎక్కువై మత్తడి దుంకుతున్నాయి. ఆయా చెరువుల పరిధిలోని రైతాంగం పొలం పనుల్లో నిమగ్న మయ్యారు.
కేతేపల్లి : మూసీ ప్రాజెక్ట్ 7 గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీరు
కేతేపల్లి, జూలై 26 : మూసీ ప్రాజెక్ట్ ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్లోకి బుధవారం మధ్యాహ్నం వరకు ఇన్ఫ్లో భారీగా పెరిగింది. మంగళవారం రాత్రి వరకు 11,045 క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో బుధవారం ఉదయానికి 13,259 క్యూసెక్కులకు పెరిగింది. మధ్యాహ్నం వరకు ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయగా, మధ్యాహ్నం తర్వాత మరో రెండు గేట్లు ఎత్తి మొత్తం 7 క్రస్ట్గేట్ల ద్వారా 13,026 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. కుడి కాల్వకు 141 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 141 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి 10,354 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు కాగా, ప్రస్తుతం 642.10(3.72 టీఎంసీలు)అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీగా దిగువకు ఇన్ఫ్లో వదిలినందున నదిలోకి రైతులు, మత్స్యకారులు, గొర్రెలు, మేకల కాపరులు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
వర్షపాతం ఇలా : శాలిగౌరారంలో 30.2 మిల్లీమీటర్లు, కట్టంగూరు, కేతపల్లి, నార్కట్పల్లి 20.1, గుండ్లపల్లి 18.8 నిడమనూరు 12.3, నకిరేకల్ 9.3, తిప్పర్తి 7.8, మాడ్గులపల్లి 7.5, అనుముల 5.8, మిర్యాలగూడ 5.8, చందంపేట 5.5, దామరచర్లలో 5 మిల్లీమీటర్ల వాన పడగా, మిగిలిన మండలాల్లో 5 మిల్లీమీటర్ల లోపు వర్షం కురిసింది.
వరి సాగు రైతులకు ఊరట..
ఈ సారి ఎగువన వర్షాలు ఆలస్యం కావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లో నీటి నిల్వలు తగ్గి నీటి విడుదల లేని కారణంగా ఆయా ప్రాజెక్ట్ల నుంచి సాగు నీటి విడుదలలో జాప్యం జరుగుతుంది. అయితే జిల్లాలో వరసగా కురుస్తున్న వర్షాలు వరి సాగు చేసే రైతుకు ఊరట కలిగిస్తున్నది. ఈ వానలతో వరి పొలాలు దున్ని చదును చేసుకునే పనిలో పడటంతోపాటు పలు చోట్ల నాట్లు వేస్తున్నారు. వరుస వర్షాలతో పత్తి సాగు చేసిన రైతుకు మాత్రం భయం కలిగిస్తున్నది. ఇప్పటి వరకు పత్తికి ఎలాంటి నష్టం లేకపోయినప్పటికి ఇంకా వానలు కొనసాగితే నష్టం తప్పేలా లేదు.
సూర్యాపేట జిల్లాలో..
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతోపాటు మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో సూర్యాపేట జిల్లాలోని చెరువుల్లో జలకళ ఉట్టి పడుతున్నది. జిల్లాలో 1,224 చెరువులకు గానూ 42 చెరువులు అలుగు పోస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నా చెరువులు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితాలు ఎలా ఉన్నాయో అర్థమవుతున్నది. సమైక్య పాలనలో పూడిన చెరువులు, శిథిలావస్థకు చేరిన తూములు, కూలిపోయిన అలుగులు, ఆనవాళ్లు కనిపించని కట్టలు, నీళ్లు లేక నెర్రెలు బారిన పరిస్థితి. అక్కడక్కడ గుంతల్లో ఎండమావుల్లా మచ్చుకు కనిపించే కొద్దిపాటి నీరు ఉండగా, వాటితో సాగుమాట దేవుడెరుగు.. కనీసం పశువుల దాహం కూడా తీరని పరిస్థితి ఉండేది. అలాంటి దయనీయ స్థితి నుంచి నేడు చెరువులు కొత్త శోభ సంతరించుకొని జలకళతో ఉట్టిపడుతున్నాయి.
చెరువులకు జలకళ
జిల్లాలో కొద్దిరోజులుగా ఆయా మండలాల్లో 3 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాంతో జిల్లాలోని 1,224 చెరువులకు గానూ 212 చెరువులు 25 శాతం నిండగా, 458 చెరువులు 25 నుంచి 50 శాతం నిండాయి. అలాగే 50 నుంచి 75 శాతం నిండిన చెరువులు 335 ఉండగా, 42 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. దాంతో ఆయా గ్రామాల రైతుల్లో ఆనందం కనిపిస్తున్నది.
17.3 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం
జిల్లాలో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో 17.3 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా తిరుమలగిరిలో 72.3 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చిలుకూరులో జీరో వర్షపాతం నమోదైంది. మద్దిరాల 60.9, తుంగతుర్తి 44.8, నూతనకల్ 37.5, ఆత్మకూర్.ఎస్ 30.3, నాగారం 28.3, మోతె 24.5, సూర్యాపేట 12.8, చివ్వెంల 12.6, అనంతగిరి 8.5, నడిగూడెం 8.3, జాజిరెడ్డిగూడెం 7, పెన్పహాడ్ 6.9, కోదాడ 6, హుజూర్నగర్ 5.5, మునగాల 5.3, పాలకవీడు 5, గరిడేపల్లి 4.9, చింతలపాలెం 4.8, నేరేడుచర్ల 4.4, మఠంపల్లి 4.3, మేళ్లచెర్వులో 2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో బిక్కేరు వాగు ఉధృతి పెరింగింది. పలు మండలాల్లో వరద ఉధృతి పెరిగి రహదారుల మధ్యలోని బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుండాల మండలం వెల్మజాల గ్రామంలో కొమ్మగల్ల సోమక్క ఇల్లు కూలిపోయింది. మంగళవారం నుంచి బుధవారం వరకు కురిసిన వర్షం అత్యధికంగా మోత్కూరులో 45.8 మిల్లీమీటర్లుగా నమోదు కాగా, జిల్లా సగటు వర్షపాతం 22.1 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో కురిసిన వర్షపాతం
జిల్లాలోని మోత్కూరులో అత్యధికంగా 45.8 మిల్లీమీటర్ల వర్షం కురువగా సగటు వర్షపాతం 22.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఆత్మకూరు(ఎం)లో 31.2 మిల్లీమీటర్లు, గుండాల 30.6, అడ్డగూడూరు 27.8, రాజాపేట 27.2, వలిగొండ 26.2, భూదాన్పోచంపల్లి 20.6, ఆలేరు, బీబీనగర్ 20.2, యాదగిరిగుట్ట 19.8, రామన్నపేట 18.6, మోటకొండూరు 18, బొమ్మలరామారం 13.6, తుర్కపల్లి(ఎం) 12.8, భువనగిరి 12.4, చౌటుప్పల్లో 10.8మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.