నల్లగొండ, నవంబర్ 1: 20 ఏండ్లు నల్లగొండ ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేసినవో ఇక్కడి ప్రజలకు తెలువదా.. గత ఎన్నికల్లో ఓడిస్తే భువనగిరి పారిపోయి టూరిస్టుగా నల్లగొండకు వచ్చిన ఇక్కడి ప్రజలు నిన్ను ఆదరిస్తారని అనుకుంటున్నావా అని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అని బీఆర్ఎస్ నేతలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.నల్లగొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇక్కడ ఐదేండ్లలో కంచర్ల భూపాల్ రెడ్డి ఎంత అభివృద్ధి చేసిండో జనానికి తెలుసు.. అది మరిచి నలుగురు కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చి కొన్నంత మాత్రాన గెలవవని, ఎస్సీ, బీసీలను బానిసల్లా చూసే నీకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని అన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ నాలుగేండ్లు పారిపోయి ఇప్పుడొచ్చి నలుగురు కాంట్రాక్టర్లను కొన్నంత మాత్రన ఎలా గెలుస్తావని, నిత్యం జనం మధ్యన ఉండే భూపాల్ రెడ్డికే కాదని, నీకు ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని అన్నారు. నల్లగొండ నుంచి భువనగిరికి పోయి ఇవ్వాళ నల్లగొండలో మళ్లీ పోటీ చేస్తానని వచ్చి డబ్బులు పెట్టి కొంటూ లీడర్లను తాగుబోతులను చేస్తూ ఓట్లు కొందామంటే ప్రజలు వినే పరిస్థితిలో లేరని, నీ లాంటి టూరిస్టులకు సరైన బుద్ధి చెబుతారన్నారు. నాయకులు వారి అభివృద్ధి కోసం పార్టీలు మారుతున్నారని, ప్రజలు ఇది గమనించి నల్లగొండ ఎలా అభివృద్ది అవుతుందో చూసి ఆగం ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో ఓడిపోయి నాలుగేండ్లు ఎక్కడో ఉండి ఇవ్వాళ నలుగురు నాయకులకు డబ్బులిచ్చి కొంటే గెలిచే పరిస్థితి లేదని రూ.1,400 కోట్లతో చేస్తున్న అభివృద్ధ్ది ప్రజలకు తెలుసని అన్నారు. ఏ రాత్రి, ఏ పగలు వస్తావో తెల్వని నిన్ను ప్రజలు నమ్మరన్నారు. నిత్యం జనం మధ్య ఉండే భూపాల్ రెడ్డికే ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు. స్థానిక నాయకులు కొందరు ఇన్నాళ్లు బీఆర్ఎస్లో ఉండి అధి కారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారడం సరికాదని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ నియోజక వర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఆలోచించి మరోసారి అవకాశం ఇస్తే దీన్ని పూర్తి చేస్తానని తెలిపారు. 20ఏండ్లలో చేయని అభివృద్ధి కోమటిరెడ్డి ఇవ్వాళ చేస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నల్లగొండ పట్టణ అభివృద్ధ్దికే రూ.1400కోట్లు వెచ్చించానని, మరో రెండేండ్లలో ఈ పట్టణం సుందర నగరంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. నా దగ్గర అన్ని పనులు చేయించుకొని ఇవ్వాళ నోట్ల కట్టల కోసం పార్టీ మారిన వారి మాటలు నమ్మకుండా నేను చేస్తున్న అభివృద్ధ్దిని చూసి అండగా ఉండాలని కోరారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తాను కార్యకర్తలకు అండగా ఉన్నానని అన్నారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసింది బీఆర్ఎస్ సర్కారే అనిమాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. రాష్ట్రంలో నాడు 275 గురుకులాలు ఉంటే నేడు 1071కి పెంచి ప్రతి విద్యార్థికి సర్కార్ రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ నియోజక వర్గం ఐదేండ్లలో ఎంతో అభివృద్ధి చెందినది అని, ఇదే కొనసాగాలంటే భూపాల్రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు.
నల్లగొండ అభివృద్ధి నేడు 1400 కోట్లతో జరుగుతుందని, ఇదే అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిని మరోసారి గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి కోరా రు. గతంలో నల్లగొండలో కనీస సౌకర్యాలు కూడా లేక పోవడంతో ఎంతో మంది హైదరాబా ద్ లాంటి నగరాలకు వెళ్లారన్నారు. బీఆర్ఎస్ స ర్కార్ వచ్చిన తర్వాత నల్లగొండలో సాగు, తాగు నీరు, ఐటీ హబ్, మెడికల్ కళాశాలతో పాటు పట్ట ణం అందంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎస్సీ, బీసీలంటే బానిసల్లాగా కనుబడుతారు అలాంటి వ్యక్తిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్ అన్నారు. జిల్లాలో ఎస్సీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వాలంటే వారు కోమటిరెడ్డి బానిసలు కావాలన్నారు. నల్లగొండలో నన్ను స్టేజీ కూడా ఎక్కనివ్వని అహంకారి కోమటి రెడ్డి అని పుల్లెంల వెంకట్ నారాయణ, సుంకరి మల్లేవ్ గౌడ్ను ఏ విధంగా ఆడుకున్నావో ప్రజలకు తెలుసు అన్నారు.మీ అహంకారానికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ చీర పంకజ్ యాదవ్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, ఫరీదుద్దిన్, కటికం సత్తయ్య గౌడ్, మాలె శరణ్యారెడ్డి, బక్క పిచ్చయ్య, బొర్ర సుధాకర్, మైనం శ్రీను పాల్గొన్నారు.