నిడమనూరు, మార్చి 10 : తరగతి గదిలోనే సమాజ నిర్మాణం ప్రారంభమవుతుందని, విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్కు బాటలు వేసిన పాఠశాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. మండలంలోని ఎర్రబెల్లి లో పాఠశాల స్థల, అభివృద్ధి దాతలు మేరెడ్డి రామకృష్ణారెడ్డి, గార్లపాటి రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల విశిష్టతను తెలిపే అక్షర ప్రత్యేక సంచికను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 1954 లో నిజాం ప్రభుత్వం విలీనం అనంతరం ఎర్రబెల్లి పరిసర గ్రామాల్లో విద్యావశ్యకతను గుర్తించి పాఠశాల, వసతి గృహాన్ని ఏర్పాటు చేయగా మేరెడ్డి రామకృష్ణారెడ్డి ఐదెకరాల స్థలాన్ని విరాళంగా అందజేయడం చారిత్రాత్మకమన్నారు. పేద వర్గాల అభ్యున్నతి కోసం విద్యాబుద్దుల నేర్పించాలన్న సంకల్పంతో సహకరించడం చారిత్రాత్మకమన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నందికొండ రామేశ్వరీమట్టారెడ్డి, ఎంపీటీసీ మొల్క సుగుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య, పూర్వ ప్రధానోపాధ్యాయుడు రామారావు, దాతల కుటుంబీకులు మేరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, జ్యోతి, వనజ, నిర్మల, గార్లపాటి సుధాకర్ రెడ్డి, పూర్వ విద్యార్థ్ధులు జూలకంటి అశోక్రెడ్డి, సురుగురు శ్రీనివాస్ రెడ్డి, నందికొండ మట్టారెడ్డి, మీసాల శ్రీనివాస్ తదితరులున్నారు.