బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఊరూరా పండుగలా సాగుతున్నాయి. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బైక్ ర్యాలీలు, ఆటపాటలు అందరిలో జోష్ నింపుతున్నాయి. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలో జరిగిన సమ్మేళనంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి.. నేరేడుగొమ్ము మండల సమ్మేళనంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్.. నల్లగొండ పట్టణంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పకొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
– మర్రిగూడ/నీలగిరి/ నేరేడుగొమ్ము(చందంపేట)ఏప్రిల్ 9
మర్రిగూడ, ఏప్రిల్ 9 : బీఆర్ఎస్ పార్టీ భారతావనికి భవిష్యత్ ఆశాకిరణమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని విజయ గార్డెన్స్లో తిరుగండ్లపల్లి, యరగండ్లపల్లి, మర్రిగూడ, వట్టిపల్లి, దామెరభీమనపల్లి ఎంపీటీసీ స్థానాల పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలతో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, 24 గంటల నాణ్యమైన విద్యుత్, ఆసరా పింఛన్లు అమలు చేస్తున్న సంక్షేమ సారథి సీఎం కేసీఆర్తోనే దేశం అభివృద్ధి చెందనున్నదని పేర్కొన్నారు. కల్లబొల్లి మాటలతో కేంద్ర ప్రభుత్వం కాలాయాపన చేస్తున్నదని, బీజేపీతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే పల్లెసీమలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, పంచాయతీలకు ట్రాకర్లు, ట్యాంకర్ల ఏర్పాటుతో శాశ్వత అభివృద్ధి జరిగిందన్నారు. 2వేల కోట్లతో శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, వీటితో మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నదన్నారు.
ఫ్లోరైడ్ మహమ్మారితో అల్లాడుతున్న ఈ ప్రాంత ప్రజలను ప్రభుత్వం అక్కున చేర్చుకున్నదని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ బాధితుల కోసం పుట్టిన మిషన్ భగీరథ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలైందన్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కావడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినట్లు కేంద్రమే ప్రకటించిందని గుర్తుచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. గ్రామపంచాయతీలకు 30 లక్షల నుంచి కోటి వరకు నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్, దళితబంధు పథకాలు త్వరలోనే అమలవుతాయన్నారు. మర్రిగూడలో 30 పడకల ఆస్పత్రిని మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, బలగమని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్దేనని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మునగాల నారాయణరావు, వేనేపల్లి వెంకటేశ్వర్రావు, ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దంటు జగదీశ్వర్, బచ్చు రామకృష్ణ, మాజీ ఎంపీపీ అనంత రాజుగౌడ్, సహకార సంఘం చైర్మన్లు పందుల యాదయ్య, బాలం నర్సింహ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్, సర్పంచులు నల్ల యాదయ్య, కల్లు స్వాతీనవీన్రెడ్డి, ఐతపాక జంగయ్య, కుంభం నర్సమ్మ, నున్సావత్ సక్కుబాయి, ఎంపీటీసీలు కట్కూరి వెంకటేశ్గౌడ్, శిలువేరు విష్ణు, గండికోట రాజమణి, దంటు జ్యోతీజగన్, గ్రామశాఖల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
తారాజువ్వలా తెలంగాణ అభివృద్ధి : ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
మోదీ దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నాడని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆరోపించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డినా సీఎం కేసీఆర్ చతురతతో తారాజువ్వలా దూసుకుపోతున్నదన్నారు. చీకట్లను చీల్చుతూ 24 గంటల నాణ్యమైన విద్యుత్తో తెలంగాణ వెలుగొందుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. తలలో నాలుకలా బీఆర్ఎస్ పార్టీ దేశ ప్రజల మనసులో స్థానం దక్కించుకుంటుందని పేర్కొన్నారు. 20 ఏండ్లలో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేండ్లలో పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారని వ్యాఖ్యానించారు. 200 ఉన్న పింఛన్ను 2,000, 3,000 రూపాయలు ఇస్తారని ఎవరూ కూడా ఊహించలేదన్నారు. రైతుబంధుతో రైతుకు పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతల కండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనందం చూస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ మోదీ దేశాన్ని దివాలా తీయిస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉందన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రసంగం మధ్యలో పాటలు పాడుతూ కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం నింపారు. సమ్మేళనానికి వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.