నీలగిరి, అక్టోబర్ 2 : నల్లగొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, ప్రగతి నివేదన సభకు హాజరైన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై ఘన స్వాగతం పలికారు. నల్లగొండ 12వ బెటా లియన్లో హెలీప్యాడ్ వద్దకు ఎమ్మెల్యేలు చేరుకొని మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రగతి నివేదన సభకు నియోజకవర్గంలోని గులాబీ సైనికులు భారీగా తరలి వచ్చారు. ప్రతి ఇంటి నుంచి బీఆర్ఎస్ జెండాను చేతబట్టి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నల్లగొండ పట్టణంలోని వార్డుల నుంచి ప్రజలు జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ పాదయాత్రలతో నివేదన సభలో భాగస్వాములయ్యారు. మధ్యాహ్నం 12 నుంచే యువత, విద్యార్థులు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక వాహనాలలో తరలిరావడంతో నల్లగొండ గులాబీమయంగా మారింది. వివిధ కళాశాలల విద్యార్థులు మర్రిగూడ బైపాస్ నుంచి సభవరకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి మానవహారం నిర్వహించారు. దారిలో విద్యార్థులను అప్యాయతతో కేటీఆర్ పలుకరించారు. బైపాస్ నుంచి సభ వేదిక వరకు వివిధ రకాల కళారూపాలు ర్యాలీలో పాల్గొన్నాయి. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో గులాబీ తోరణాలతో అంతా గులాబీమయమైంది. యువత, జై కేసీఆర్…జైజై కేటీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి.
మంత్రి కేటీఆర్కు స్వాగతం పలికిన వారిలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్ నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్డ్డి, నోముల భగత్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కల్లు ,గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్, టీఎస్ ఫుడ్స్ చైర్మన్న మేడే రాజీవ్సాగర్, ఎస్సీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్, గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు.
భారీ బందో బస్తు…
నల్లగొండ: మంత్రులు జగదీశ్ రెడ్డి, కేటీఆర్ ప్రగతి నివేదన సభ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం సభకు వచ్చే వారికి ఇబ్బంది కలుగకుండా పోలీస్ శాఖ జాగ్రత్తలు తీసుకుంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల్లో కొన్నింటిని సభా ప్రాంగణంలో, మరికొన్నింటిని రామగిరి, హైదరాబాద్ రో డ్డు, క్లాక్ సమీపంలో పార్కింగ్ చేయించి జనాన్ని సభా ప్రాంగణానికి తరలి వెళ్లేలా చేశారు. సభా ప్రాంగణంలోనూ వచ్చిన వారికి వేల సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయించి వాళ్లు వెళ్లే వరకు జాగ్రత్తలు తీసుకున్నారు.