హుజూర్నగర్, జూన్ 5 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కష్టాలు తప్పవన్న ఆంధ్రా పాలకుల మాటలను పటాపంచలు చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో సరిగ్గా కరెంటు లేక రైతులు, ప్రజలు అనేక అవస్థలు పడ్డారన్నారు. అరకొరగా వచ్చే విద్యుత్ కోసం రైతులు రాత్రుళ్లు మోటర్ల వద్దకు వెళ్లి అనేక మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 7వేల మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17వేల మెగావాట్లకు పెరిగిందన్నారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతు ఆత్మహత్యలకు కారణమైందని ఆరోపించారు. రైతులకు ఏవిధంగా మేలు చేయాలి, ఏ పంట వేయాలి.. పండించిన పంటకు మద్దతు ధర ఎలా కల్పించాలని సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తారని తెలిపారు.
గత పాలకులు పదవుల కోసం పనిచేస్తే.. సీఎం కేసీఆర్ ప్రజల బాగు కోసం పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన సబ్స్టేషన్లు, లైన్ల ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ.. రజకులకు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నదని తెలిపారు. గతంలో వినియోగదారులు ఫోన్ చేస్తే విద్యుత్ అధికారులు భయపడేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. విద్యుత్ సిబ్బంది పారదర్శకంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. దేశంలో అభివృద్ధిపై ఉత్సవాలు చేసుకునే సత్తా బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉన్నదన్నారు. కార్యక్రమంలో దశాబ్ది ఉత్సవాల చైర్మన్, డీపీఓ యాదయ్య, ఐసీడీసీ పీడీ పద్మజ్యోతి, డీఈ వెంకటకృష్ణయ్య, ఏడీఈ సక్రుంనాయక్, ఎంపీపీలు గూడెపు శ్రీను, పెండెం సుజాత, పార్వతి, జడ్పీటీసీలు కొప్పుల సైదిరెడ్డి, జగన్నాయక్, చంద్రకళ, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ జయబాబు, హుజూర్నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీసీబీబీ డైరెక్టర్ రంగాచారి పాల్గొన్నారు.