హుజూర్నగర్, మే 4 : నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం పులిచింతల ముంపు బాధితుల కల నెరవేరింది. ముంపు బాధితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలెక్టర్, పులిచింతల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఏండ్ల నాటి ముంపు బాధితుల సమస్యకు పరిష్కారం చూపారు. అందులో భాగంగా వెల్లటూరు గ్రామానికి చెందిన 170మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను క్యాంపు కార్యాలయంలో గురువారం అందించారు.
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు పులిచింతల ముంపు బాధితుల కష్టాలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల ఎంపికలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులను పక్కన పెట్టి నచ్చిన వారికి ప్యాకెజీ ఇప్పించారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మేళ్లచెర్వు తాసీల్దార్ దామోదర్రావు పాల్గొన్నారు.