దేవరకొండ/ మాల్, ఏప్రిల్ 15 : ముఖ్యమంత్రి కేసీఆర్తోనే పేదల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టడంతోపాటు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చింతపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి శ్రేణులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సాధ్యమయ్యాయన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ విషయంలో రైతులు ఎలా గోసపడ్డారో చూశామని, స్వరాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ను అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. గిరిజనులకు 6శాతం ఉన్న రిజర్వేషన్లను 10శాతానికి పెంచారని చెప్పారు.
ప్రజల మనస్సును చూరగొన్న ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐల ద్వారా కేసులు పెడుతున్నదని విమర్శించారు. ఓ వైపు ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తున్న కేంద్రం.. మరోవైపు నిత్యావసర ధరలను పెంచి సామాన్యులపై పెను భారం మోపుతున్నదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా పేదలకు గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అందిస్తే పేదలు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పారు. దేశవ్యాప్తంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందలాంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు మరిన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయన్నారు.
నియోజకవర్గంలో 5 రిజర్వాయర్ల పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయితే ప్రతి ఎకరానికీ సాగు నీరు అందుతుందని తెలిపారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 27న ప్రతి గ్రామంలో, వార్డుల్లో పార్టీ జెండా పండుగ నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకేళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. నిమోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, నాయకులు గున్రెడ్డి శ్రీనివాస్రెడ్డి, సాగర్రావు, వింజమూరి రవి, నట్వగిరి, అండెకారు అశోక్, పూల యాదయ్య, కొప్పుల రాములు గౌడ్, చాంద్పాషా, జగన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.