మాల్, నవంబర్17: తెలంగాణ రాష్ట్రం రాక ముందు పల్లెలు, గ్రామాలు, తండాలు ఎట్లుండే.. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఎట్లున్నయ్.. ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలంలోని గొడకొండ్ల, మాల్, పోలేపల్లిరాంనగర్, బోడిమిదితండా, ఎర్రమట్టి తండా, మదనాపురం, గొల్లపల్లి, కుర్మేడ్, చారలిశేరిపల్లి, ఉమ్మాపురం, గొల్లపల్లి, తక్కళ్లపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడే అవకాశం లేదని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ముడు గంటలు చాలు అంటున్న కాంగ్రెస్ పాలన కావాల్నా… నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తున్న బీఆర్ఎస్ పాలన కావాల్నా అని ప్రజలను ప్రశ్నించారు. ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పారు.
అభివృద్ధిని చూసి ఏం మాట్లాడాలో తెలియక రేవంత్ రెడ్డికి పిచ్చెక్కిపోతుందని, ఆయన మాటలను ప్రజలను నమ్మవద్దని అన్నారు. నియోజకవర్గంలోనే పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు అందించిన గ్రామం గొడకొండ్ల గ్రామంలోని మాల్కు అని గుర్తు చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే రైతుబంధు రూ.10వేల నుంచి 16 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. మరో సారి అవకాశం ఇస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తానని ఆయన కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రచారంలో భాగంగా వీటీ నగర్, పాలేంతండాలోంచి కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 100మంది నాయకులు బీఆర్ఎస్లోకి చేరారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్, కంకణాల వెంకట్రెడ్డి, కిషన్నాయక్, బిల్యానాయక్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
కార్యకర్తలు
దేవరకొండ : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 13 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 13 వార్డులో 100 కుటుంబాలు, బీజేపీ పట్టణ యువమోర్చ అధ్యక్షుడు పొలగొని గణేశ్తో పాటు 300 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలు, మ్యానిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించే బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ హామీలను అమలు పర్చి అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఈ పందేండ్లల్లో సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేశారని ఆయన చెప్పారు. అభివృద్ధి పరుగులు ఆగకుండా ఉండాలంటే మళ్లీ కారు గుర్తుకు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలు మాటలకే పరిమితమని ఆయన ఎద్దేవా చేశారు. రైతు బీమా తరహాలో తెల్ల రేషన్ కార్డు వున్న లబ్దిదారులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ. 5లక్షలు బీమాను వర్తింప చేస్తారని అన్నారు. తెల్ల రేషన్ కార్డు వున్న లబ్దిదారులకు సన్నబియ్యం అందించనున్నట్లు ఆయన చెప్పారు. మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే ఈ పథకాలు అమలు అవుతాయని భరోసా ఇచ్చారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో వెళ్లాలంటే మళ్లీ కేసీఆర్ను సీఎం చేయాలని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు నేనావత్ కిషన్ నాయక్, రమావత్ రమేష్నాయక్, నీల రవికుమార్, పల్లేపు అశోక్, మురళి, తౌఫిక్ వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ ఉన్నారు.
గుడిపల్లి: కోదండాపురానికి చెంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంద్రకంటి నాగేశ్, సొనగంటి శేఖరాచారి కుటుంబాలు శుక్రవారం దేవరకొండ మాజి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలుయాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్లోకి చేరారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి ఇన్ఫా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముచ్చర్ల శ్రీకాంత్యాదవ్, సర్పంచ్ మైనం రాణివెంకటయ్య, ఉప సర్పంచ్ ముచ్చర్ల సత్యనారాయణ, మండాది మల్లయ్య, బుర్రి కృష్ణయ్య, ఇంద్రకంటి సురేష్, ఈర్ల సత్యనారాయణ, మైనం కొండలు, మైనం శ్రీనివాసులు, చెన్నబోయిన కొండల్, నిరసనమెట్ల ఎల్లయ్య, పోలే పరమేశ్, పోలె అజయ్, గొర్ల నాగేశ్, లచ్చయ్య, బెజవాడ కొండయ్య, మహేశ్, శివ, కృష్ణయ్య, ముత్యాలు పాల్గొన్నారు.