‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో భువనగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కరువును పారదోలాం. సాధించింది చాలా ఉంది.. సాధించాల్సింది ఇంకా ఉంది. మళ్లీ గెలిచాక మిగిలిపోయిన పనులు, అన్ని రంగాల్లో ఇంకింత ప్రగతిని పరుగులు పెట్టిస్తాం. సంక్షేమ పాలన కొనసాగిస్తాం. బీఆర్ఎస్కు ఓటేస్తే చెరువుల్లో నీళ్లు వస్తాయి. అదే కాంగ్రెస్ ఓటేస్తే కండ్లల్లో నీళ్లు వస్తాయి.
మరోసారి ఆశీర్వదిస్తే భువనగిరిలో ఐటీ హబ్, బీబీనగర్కు మెట్రో రైలు తీసుకొస్తా. త్వరలోనే నృసింహసాగర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను తీసుకొస్తాం. సీఎం కేసీఆర్ బలం, భువనగిరి ప్రజలే నా బలగం. మా గెలుపు ఎప్పుడో ఖాయమైంది. భారీ మెజార్టీ కోసమే మా ఆరాటం’ అని బీఆర్ఎస్ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తనను మరోసారి ఆశీర్వదిస్తే భువనగిరిలో ఐటీ హబ్, బీబీనగర్కు మెట్రో రైలు తీసుకొస్తానని, అలాగే త్వరలోనే నృసింహసాగర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను తీసుకొస్తానని బీఆర్ఎస్ భువనగిరి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తెలిపారు. భువనగిరి ప్రజలే తన బలం, బలగమని తన గెలుపు ఎప్పుడో ఖాయమైందని.. భారీ మెజార్టీ కోసమే తమ ఆరాటంమని చెప్పారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను మంగళవారం ఆయన నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
నీతి, నిజాయితీ పరిపాలనే మా ఎజెండా. ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు పడలేదు. నిత్యం జనంలో ఉన్నా. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నా. కుటుంబ సభ్యుడిలా మెదులుకున్నాను. 2014 కంటే ముందు భువనగిరిలో ఘోరమైన పరిస్థితులు ఉండేవి. తాగు, సాగునీరు లేదు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నది. నాటి పాలకులు కనీసం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి అంటే ఏంటో చూపించాం. నాటి కరువును పారదోలాం. తాగు, సాగునీరు అందించాం.
పదేండ్లుగా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించా. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. భువనగిరి నియోజక వర్గం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. నియోజక వర్గంలోని గ్రామాల్లో 90 శాతం సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. భువనగిరి, పోచంపల్లి మున్సిపాలిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. గల్లీగల్లీకి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయించాం. ఇప్పటికే మూసీ నదిపై వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. మూడోసారి గెలువగానే వాటిని పూర్తి చేస్తాం. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. అది కొనసాగుతుంది.
నాటి కాంగ్రెస్ పాలనలో పేదింటి ఆడబిడ్డ కాన్పు కావాలంటే పుట్టేడు కష్టాలు పడేది. నేడు కేసీఆర్ పాలనలో బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషియన్ కిట్. బిడ్డ ప్రపంచాన్ని చూడగానే కేసీఆర్ కిట్. కాన్పు చేసి తల్లీబిడ్డలను 102 వాహనంలో ఇంటి కాడ దించుతున్నం. ప్రభుత్వ పథకాలన్నీ అర్హులందరికీ వర్తింపజేశాం. మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ చేసి చూపించాం. సంక్షేమానికి చిరుమానా బీఆర్ఎస్. సీఎం కేసీఆరే రాష్ర్టానికి శ్రీరామరక్ష.
భువనగిరిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాంతో పాటు బీబీనగర్ వరకు మెట్రో రైలును తీసుకొస్తాం. దాని ద్వారా అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. భువనగిరిలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తా. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తా. ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పునకు పోరాడుతాను. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం.
రైతు బాగుండాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. కాళేశ్వరం జలాల కోసం మన దగ్గర నృసింహసాగర్ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నాం. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. రిజర్వాయర్ ముంపు బాధితులను అన్ని విధాలుగా అదుకుంటున్నాం. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలు తీసుకొస్తాం. భువనగిరి గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తాం ప్రజల్లో స్పందన చాలా బాగుంది. జనం నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. భువనగిరి నియోజక వర్గంలో బీఆర్ఎస్ సైనిక దళం ఉన్నది. పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది. ఎప్పుడు ఓటేద్దామా అనే ఉత్సాహంతో పని చేస్తున్నారు. గ్రామాల్లో ఈ స్పందన మరింత ఎక్కువగా ఉన్నది. మా గెలుపు ఎప్పుడో ఫైనల్ అయ్యింది. మేమంతా భారీ మెజార్టీ కోసం ఆరాటడుతున్నాం. భువనగిరి ఖిలాపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. నియోజక వర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.
సీఎం కేసీఆర్ పాలనలోనే 24 గంటల కరెంట్, పుష్కలంగా సాగు, తాగునీరు అందుతున్నది. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయి. 3 గంటల కరెంట్ కావాల్నా ? లేక 24 గంటల కరెంట్ కావాల్నా ? అనేది ప్రజలు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదు. కాంగ్రెస్వి పగటి కలలు. 55 ఏండ్లు పరిపాలించినా ఏం జరిగిందో ప్రజలు చూశారు. 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని కండ్లజూస్తున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు నెలకొల్పుతారు.