హాలియా, జూలై 14 : నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు ఎమ్మెల్యే నోముల భగత్కుమార్. తాను ఎన్నికైన 24 నెలల కాలంలోనే ప్రతిపక్ష నాయకులు సైతం ముక్కున వేలేసుకునేలా నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆత్మీయ సమ్మెళనాలకు తోడు మన ఊరు-మన ఎమ్యెల్యే పేరుతో ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధిపై
ఎమ్మెల్యేతో నమస్తే తెలంగాణ మాటా మంతి
నమస్తే ప్రశ్న : నమస్తే ఎమ్మెల్యే గారు. మీరు చేపట్టిన మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటి ?
ఎమ్మెల్యే : గత పాలకుల అసమర్థ విధానాల వల్ల నేటికి గ్రామాల్లో సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనే సంకల్పంతో మన ఊరు-మన ఎమ్మెల్యే, మన వార్డు-మన ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మూడు ఉద్దేశాలు. ప్రజలతో మమైకమై వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకోవడం. వారి సాదక బాదకాల్లో పాలుపంచుకోవడం, అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేకా ఏమైనా ఇబ్బందులు ఎదురైతున్నాయా అని ప్రత్యక్షంగా పరిశీలించడం, ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడం.
నమస్తే ప్రశ్న : ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది?
ఎమ్మెల్యే : గ్రామాల్లోకి వెళ్లగానే ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఊరు వాడ తిరుగుతుంటే ప్రజలు తమ సాదక బాదకాలు చెబుతున్నారు. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది.
నమస్తే ప్రశ్న : ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రజలు ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నారు ?
ఎమ్మెల్యే : తమ వీధికి సీసీ రోడ్లు వేయాలని, డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేపట్టాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. మరికొందరు రేషన్కార్డు కావాలని, 58 ఏళ్ల నిండిన వారు పింఛన్ కావాలని కోరుతున్నారు.
నమస్తే ప్రశ్న : 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం చేసిన కృషి?
ఎమ్మెల్యే : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని గట్టిగా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పల్లె ప్రగతితో గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేశాం. ప్రతి ఏటా ఉత్తమ గ్రామ పంచాయతీల పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో నూటికి 90 శాతం అవార్డులు, మన రాష్ర్టానికే వస్తున్నాయి.
నమస్తే ప్రశ్న : నియోజకవర్గ అభివృద్ధికి మీరు, మీ నాన్నగారు చేసిన సేవలు?
ఎమ్మెల్యే : నెల్లికల్లు లిఫ్ట్, డీ 8,9 కెనాల్పై లిఫ్ట్, గుర్రంపోడు లిఫ్ట్లను తీసుకురావడం జరిగింది. సుమారు 30 వేల ఎకరాల బీడు భూములకు సాగునీటిని అందించి సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాను. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాగర్లో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించడం జరిగింది. నిడమనూర్కు కొత్తగా కోర్టు భవనం తీసుకురావడంతో పాటు కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
నమస్తే : హాలియా, నందికొండ మున్సిపాలిటీల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు?
ఎమ్మెల్యే : హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు రూ.115.20 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. హాలియా మున్సిపాలిటీకి రూ.43.20 కోట్లు, నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.72 కోట్లు కేటాయించడం జరిగింది.
నమస్తే : గత పాలకులకు మీకు మధ్య ఉన్న వ్యత్యాసం ?
ఎమ్మెల్యే : గతంలో నాయకులు ఎమ్మెల్యేగా గెలిచాక హైదరబాద్కే పరిమితమయ్యేవారు. కానీ నేను నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటా పరిష్కరిస్తున్నా. నాగార్జున సాగర్ నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.
నమస్తే : మీ రెండేండ్ల పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులు?
ఎమ్మెల్యే : మా నాన్న అకాల మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. 2021 మే 2 సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే గెలిచా. ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలో సుమారు రూ. వెయ్యి కోట్ల మేర గ్రామీణ, పట్టణాభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో రూ.30 లక్షల నుంచి 70 లక్షల మేర అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది.
మక్కపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గుర్రంపోడు : మండలంలోని మక్కపల్లిలో మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నోముల భగత్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ్జల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు, సర్పంచ్ బాల్రెడ్డి, మండల అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ దోటి చంద్రమౌళి, సర్పంచులు చాడ చక్రవర్తి, జకల భాసర్, కేసాని యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.
పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
హాలియా, జూలై 14 : పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం హాలియా క్యాంప్ కార్యాలయంలో నందికొండ మున్సిపాలిటీకి చెందిన 8 మందికి 100 శాతం సబ్సిడీతో రూ.4లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ణె బ్రహ్మానందరెడ్డి, నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్, మహేశ్ పాల్గొన్నారు.