నందికొండ, మే 28 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, పాలన సాధ్యం కాదని ఎద్దేవా చేసిన వారి నోర్లు మూసుకునేలా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలో 58, 59 జీఓల కింద ఇండ్ల క్రమబద్ధీకరణలో భాగంగా మొదటి విడుతలో పట్టాలు వచ్చిన 558 మందికి ‘మన వార్డుకు మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఆదివారం ఇంటింటికీ తిరిగి ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గ్రామపంచాయతీ కూడా కాని నాగార్జునసాగర్ను నందికొండ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో నాయకులు 40 ఏండ్లుగా నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇప్పించాలనే విషయాన్ని మరిచిపోయారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల పట్టాలు అందజేశారన్నారు. సొంతింటి కలను నిజం చేస్తూ హక్కుదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నందుకు నందికొండ వాసులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారన్నారు.
నందికొండ మున్సిపాలిటీలో 13.5కోట్ల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, పైలాన్ కాలనీలో కోటితో ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ, కోటితో వైకుంఠధామం, 8 కోట్లతో పిల్లర్ నుంచి జెన్కో గెస్ట్ హౌస్ వద్ద ఉన్న బైపాస్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్తో 60 ఫీట్ల రోడ్డు, హిల్కాలనీలో 2 కోట్లతో వెజ్, నాన్వెజ్ మార్కెట్, కోటితో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కృషితోనే 100 పడకల ఆసుపత్రి ప్రారంభించడంతోపాటు డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు.
అనంతరం హిల్కాలనీ కమ్మ సేవా సంఘంలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజేందర్రెడ్డి, జడ్పీటీసీ, అబ్బిడి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, మోదుకూరి రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్ మంగ్తానాయక్, తాసీల్దార్ సైదులుగౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, కార్యదర్శి భూషరాజుల కృష్ణ, కో ఆప్షన్ సభ్యుడు బషీర్, వార్డు అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.