ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన మిర్యాలగూడ నియోజకవర్గం నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుండడంతో ప్రగతి పరుగులు పెడుతున్నది. నాలుగున్నరేండ్లలో నియోజకవర్గంలో రూ.1,785 కోట్లతో పనులు జరిగాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రహదారులు వేశారు. ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థను బలోపేతం చేసి కార్పొరేట్ స్థాయి సేవలను పేదలకు అందుబాటులోకి తెచ్చారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో అభివృద్ధి, సంక్షేమం విరాజిల్లుతున్నది. దేశంలోనే అతి పెద్ద యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ను దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్నారు. ఇది ఎంతో మంది ఉద్యోగ, ఉపాధికి కేంద్రంగా మారనున్నది. మిర్యాలగూడ ఏరియా దవాఖానను 200 పడకలకు అప్గ్రేడ్ చేయడంతో పాటు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు రూ.14 కోట్లు మంజూరయ్యాయి. డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో కిడ్నీ బాధితులకు ఊరట కలిగింది. దామరచర్ల, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండలాల్లో వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన లిఫ్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.56 కోట్లతో 12 చెక్ డ్యామ్ల నిర్మాణం జరుగుతున్నది. మన ఊరు- మన బడి పథకంలో భాగంగా రూ.40 కోట్లతో 70 పాఠశాలల పునర్నిర్మాణ పనులు చేపట్టగా విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. రూ.5.60 కోట్లతో 28 గ్రామీణ ఆస్పత్రి భవనాలు, మిర్యాలగూడ మున్సిపాలిటీలో రూ.80 లక్షలతో 4 బస్తీ దవాఖానలు నిర్మించనున్నారు.
మిర్యాలగూడ, మార్చి 24 : స్వరాష్ట్రంలో మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగేండ్లలోనే రూ.1,785 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో మిర్యాలగూడ పట్టణంతోపాటు అన్ని మండలాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దేశంలోనే అతి పెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ను దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే రాష్ర్టానికి కరంటు పుష్కలంగా అందడంతోపాటు వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏరియా ఆసుపత్రిని 300 పడకల స్థాయికి పెంచి జిల్లా కేంద్ర దవాఖానగా మార్చుతున్నారు. వందల కోట్లతో చెక్డ్యామ్లు, బ్రిడ్జిలు, రోడ్లు, పంచాయతీ భవనాలు, పల్లె దవాఖానల నిర్మాణాలు జరిగాయి. మిర్యాలగూడ పట్టణం సుందరంగా రూపుదిద్దుకుంటుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.30వేల కోట్లతో థర్మల్ పవర్ స్టేషన్
రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లతో దేశానికే తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్నది. 4,276 ఎకరాల్లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు బాయిలర్లను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికి 2500 మంది కార్మికులు రేయింబవళ్లు పని చేస్తున్నారు. ఇప్పటికే 90శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. నీటి అవసరాల కోసం 3.5టీఎంసీల నీటి స్టోరేజీ కలిగిన రిజర్వాయర్ను పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్కు టెయిల్పాండ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించేందుకు పైపులైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బొగ్గు రవాణాకు విష్ణుపురం నుంచి పవర్ప్లాంటు వద్దకు ప్రత్యేకంగా రైల్వేట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 4వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చి వ్యవసాయానికి, పరిశ్రమలకు కరెంట్ కొరత తీరనున్నది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రూ.14కోట్లతో ఏరియా దవాఖాన పునర్నిర్మాణం
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషితో మిర్యాలగూడ ఏరియా దవాఖాన జిల్లా కేంద్ర ఆస్పత్రిగా మారుతున్నది. ఇందులో భాగంగా దవాఖానలో మరో వంద పడకు పెంచి 200 పడకలకు చేయనున్నారు. ట్రామా కేర్ సెంటర్కు 50 పడకల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.14కోట్లు మంజూరు చేసింది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా గర్భిణులు, చంటి పిల్లలకు మెరుగైన చికిత్స అందించేందుకు 50 పడకలతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించేందుకు 20పడకలతో పీడియాట్రిక్ కేర్ సెంటర్, అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవల కోసం మరో పది పడకలతో ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో నూతన పరికరాలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం రూ.1.72కోట్లు మంజూరయ్యాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లో నిత్యం 30మంది రక్తశుద్ధి చేయించుకుంటున్నారు.
ముమ్మరంగా ఎత్తిపోల పనులు
నియోజకవర్గంలోని దామరచర్ల, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి మండలాల పరిధిలో 5 ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం కేశవపురం – కొండ్రపోల్ లిఫ్ట్ట్, బొత్తలపాలెం – వాడపల్లి, దున్నపోతులగండి – చిట్యాల చాంప్లాతండా, వీర్లపాలెం ఎత్తిపోతల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.9.90కోట్లతో చేపట్టే తోపుచర్ల లిఫ్ట్ పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ఐదు లిఫ్టుల నిర్మాణం పూర్తయితే 50వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. సుమారు 15 గ్రామాల పరిధిలో భూగర్భజలాలు పెరుగనున్నాయి.
నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు..
నియోజకవర్గ వ్యాప్తంగా రూ.2కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. ఉపాధిహామీ నిధులు రూ.30కోట్లతో సీసీ రోడ్లు వేశారు. నాలుగు బీటీ రోడ్ల నిర్మాణానికి పీఎంజీఎస్వై నిధులు రూ.14.55కోట్లు మంజూరయ్యాయి. నందిపహాడ్ – ఐలాపురం రోడ్డు, అద్దంకి – నార్కట్పల్లి రహదారి నుంచి అభంగాపురం రోడ్ల నిర్మాణానికి ఆర్ అండ్ బీ నిధులు రూ.15.10 కోట్లు మంజూరయ్యాయి. మాడ్గులపల్లి మండలం బొమ్మకల్ గ్రామం వద్ద పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.50కోట్లు మంజూరయ్యాయి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఐదు మండలాలకు రూ.30.30కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపారు. దామరచర్ల మండలంలో డీఎంఎఫ్టీ నిధులు రూ.3కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టారు. వీర్లపాలెంలో వైటీపీఎస్ సీఎస్ఆర్ కింద గ్రామాభివృద్ధికి రూ.4.21కోట్లు మంజూరయ్యాయి. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.7.23కోట్లతో బీటీ రోడ్ల మరమ్మతులు చేపట్టారు. కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పడిన తండాలను కలుపుతూ 16కి.మీ. బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.8.36కోట్లు మంజూరయ్యాయి. మాడ్గులపల్లి మండలం చిరుమర్తి, పోరెడ్డిగూడెం, పాములపాడు, బీరెళ్లిగూడెం 21కి.మీ. మేర రోడ్డు నిర్మాణానికి రూ.4.34కోట్లు మంజూరయ్యాయి. ఐదు మండలాల పరిధిలో ఈ రెండు నెలల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.12కోట్లు మంజూరయ్యాయి. దామరచర్ల మండలం కేంద్రం నుంచి వీర్లపాలెం వైటీపీఎస్ వరకు రూ.100 కోట్లతో నాలుగు లైన్ల సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ పనులన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
491కోట్లతో పట్టణ అభివృద్ధి
మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.491 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.18కోట్లతో 48వార్డుల పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టారు. అసంపూర్తిగా ఉన్న మినీ రవీంద్రభారతి నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.1.67కోట్లతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కొనుగోలు చేశారు. రూ.72లక్షలతో పట్టణంలోని పలు కూడళ్ల వద్ద పబ్లిక్ టాయ్లెట్లు నిర్మించారు. టీఎస్పీ, సీడీపీ నిధులు రూ.4కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో ఏడు వేల ఎల్ఈడీ దీపాలు, 9వేల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, షాదీఖాన, స్లాటర్ హౌజ్, హిందూ శ్మశానవాటిక అభివృద్ధి తదితర నిర్మాణాల కోసం రూ.61కోట్లు మంజూరయ్యాయి. రోడ్లను శుభ్రం చేసేందుకు రూ.42లక్షలతో స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేశారు. అమృత్ పథకం కింద రూ.93కోట్లతో తాగునీటి సరఫరా పైపులైన్ల నిర్మాణం చేపట్టారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.173కోట్లు మంజూరయ్యాయి. కోదాడ – జడ్చర్ల రహదారి నిర్మాణంలో భాగంగా పట్టణంలో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి రూ.126కోట్లు కేటాయించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో నియోజకవర్గ వ్యాప్తంగా రూ.54కోట్లతో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు జరిగాయి. ప్రతి గ్రామానికీ ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ సమకూరాయి.
అన్ని రంగాల్లో తిరుగులేని అభివృద్ధి
గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరూ మిర్యాలగూడ నియోజకవర్గానికి తీసుకురానన్ని నిధులు నేను తీసుకువచ్చాను. 2014 నుంచి అనేక పథకాల ద్వారా గ్రామ గ్రామాన అభివృద్ధి చేశాను. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో దేశంలోనే అతి పెద్ద మెగా థర్మల్ పవర్ ప్లాంటును రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. త్వరలో ప్రారంభమయ్యే ఈ ప్లాంటు ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మేజర్ల కింద బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐదు లిఫ్టుల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయించాను. వీటి ద్వారా సుమారు 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అన్ని గ్రామాల్లో 90 శాతానికి పైగా సీసీ రోడ్లు వేశాం. మిగిలిన వాటికి కూడా నిధులు మంజూరయ్యాయి. సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలు జరుపుకొనేందుకు సుమారు రూ.4 కోట్లతో మినీ రవీంద్రభారతిని నిర్మించాం. ఇది త్వరలో మంత్రి కేటీఆర్ చేత ప్రారంభిస్తాం. అన్ని చెరువుల పునరుద్ధరణ చేపట్టాం. ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచాను. ఇక ముందు కూడా సీఎం కేసీఆర్ అండదండలతో మరింత అభివృద్ధి చేస్తాను.
-నల్లమోతు భాస్కర్రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే
చెక్డ్యామ్లతో సాగు పెరిగింది
రైతుల బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్డ్యామ్లు నిర్మించారు. మండలంలో నిర్మించిన ఆగామోత్కూర్, చిరుమర్తి, కల్వలపాలెం చెక్డ్యామ్లు నీటితో కళకళలాడుతున్నాయి. వాటితో భూగర్భజలాలు పెరిగి బోర్లు బాగా పోస్తున్నాయి. ఇప్పుడు మాకు సాగునీటికి ఢోకా లేదు. మండలంలో సాగు విస్తీర్ణం పెరిగింది. పంటలు బాగా పండి ఇంత ముద్ద తింటున్నామంటే సీఎం కేసీఆర్ చలువే. ముందు చూపుతో చెక్డ్యామ్లను నిర్మించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– కప్పల లింగయ్య, రైతు, కల్వలపాలెం, మాడ్గులపల్లి మండలం
మున్సిపాలిటీ ముఖచిత్రం మారిపోయింది
బీఆర్ఎస్ పాలనలో ప్రతి పల్లె, పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. మారుమూల గ్రామాలు సైతం సిమెంట్ రోడ్లు, పచ్చని చెట్లతో కొత్త సొబగులు అద్దుకున్నాయి. మున్సిపాలిటీల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. గతంలో సామాజిక న్యాయం అనడమే తప్ప ఆచరణలో చూపిన ముఖ్యమంత్రులు లేకుండే. సీఎం కేసీఆర్ ప్రతి కులానికీ సంక్షేమ పథకాలను అందిస్తూ.. సభలు, సమావేశాల కోసం భవనాలను నిర్మించి వారి ఆత్మగౌరవాన్ని పెంచారు. ఎవరెన్ని చెప్పినా ఈ 9ఏండ్లలో చెందిన మాట వాస్తవం. అందుకు ఈ భవనాలే సజీవ సాక్ష్యం.
– తిరందాసు విష్ణు, మిర్యాలగూడ
గిరిజనుల బాధలు తీరినయ్
సీఎం కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో కొద్దికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయి. గ్రామపంచాయతీ భవనాలు, అంతర్గత, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది. పల్లె ప్రకృతివనం, రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పచ్చదనం ఉట్టిపడుతున్నది. దశాబ్దాలుగా తాగునీటికి నోచుకోని తండాలకు మిషన్ భగీరథ అందుతున్నాయి. గతంలో ఎవరైనా చనిపోతే దానం చేసేందుకు స్థలం కరువై తీవ్ర ఇబ్బందులు పడేది. నేడు వైకుంఠధామాల ఏర్పాటుతో ఆ బాధలు తొలగిపోయాయి. తండాలన్నీ చక్కగా అభివృద్ధి చెందడంతో గిరిజనుల తిప్పలు తీరాయి.
– శ్రవణ్నాయక్, లావూడితండా, మిర్యాలగూడ మండలం
పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ
గత పాలకుల హయాంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో పల్లెలకు మహర్దశ పట్టింది. ఇదివరకు గుంతలు పడిన రోడ్లు ఇప్పుడన్నీ సీసీ రోడ్లు అయ్యాయి. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. రైతులు చర్చించుకునేందుకు రైతు వేదికలు నిర్మించారు. అప్పట్లో తాగు, సాగు నీటి కోసం అల్లాడినం. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయడంతో పంట పొలాలకు సరిపడా సాగు నీరు అందుతున్నది.
– మొగిలిచర్ల శేఖర్, మొల్కపట్నం, వేములపల్లి మండలం
లిఫ్ట్ నీళ్లతో రెండు పంటలు పండిస్తాం
మా భూములన్నీ మంచి సాగు నేలలు. నీటి సదుపాయాలు లేక వానల ఆధారంగా పంటలు పండించుకుంటున్నాం. మా ఊరు పక్కనుంచే కృష్ణానది, అన్నవేరు వాగు పోతున్నా.. గతంలో మా బాధలు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ సారు దయవల్ల నీటిని ఎత్తిపోసే పథకం వచ్చింది. మా ఊరి చివరలో ఉన్న కృష్ణానది వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. పనులు మొదలయ్యాయి. అది పూర్తయితే కొన్నేండ్లుగా బీడుగా ఉన్న మా భూములు సాగులోకి వస్తాయి. రెండు కార్లు పంటలు పండించుకుంటాం. పక్క ఊర్లలో ఉన్న భూములు కూడా పచ్చబడుతాయి. ముఖ్యమంత్రి మేలు ఎప్పటికీ మరువలేం.
– రాయికింది లింగయ్య, తాళ్లవీరప్పగూడెం, దామరచర్ల మండలం