సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 27: పేదలకు రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పంపిణీ చేస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటే అని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని సర్వేల్ గ్రామంలో రూ.3.75 కోట్లతో నిర్మించిన 64 డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం 28 మంది పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఊరిలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలలాలు అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇండ్లు రాని వారికి గృహలక్ష్మి పథకంలో భాగంగా రూ.3లక్షలను అందిస్తాన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 3 వేల మందికి త్వరలోనే గృహలక్ష్మి పథకం పత్రలను అందిస్తానన్నారు. ఉప ఉన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ఇతర పనులు కూడా పూర్తి చేస్తున్నామన్నారు. రూ.571 కోట్లతో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. అనంతరం నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు చెందిన 22 మంది పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్- 4 కార్యదర్శులుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్స్ను అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీ గౌడ్, ఆరీఓ జగన్నాథరావు, తాసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ రాములు, పీఏసీఎస్ చైర్మన్లు జక్కిడి జంగారెడ్డి, యాదవరెడ్డి, ఎంపీటీసీలు ఈసం యాదయ్య, నర్రి పావని, సర్పంచులు కట్టెల భిక్షపతి, యాదయ్య, యాదిరెడ్డి, పాండురంగానాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మయ్య, అధికారులు పాల్గొన్నారు.
దండుమల్కాపురంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ
చౌటుప్పల రూరల్ : మండలంలోని దండు మల్కాపురం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 72 మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నిరుపేదలకు 75 గజాల చొప్పున స్థలం అందించేందుకు కృషి చేస్తానన్నారు. దండుమల్కాపురాన్ని డంపింగ్ యార్డ్గా మార్చేందుకు కాంగ్రెస్ పాలకులు ప్రయత్నించారని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చెందిందన్నారు.
జీహెచ్ఎంసీ నిధులు రూ.25 కోట్లతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస్రావు, ఆర్డీఓ జగన్నాథరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కాటి నిరంజన్గౌడ్, అధికారులు పాల్గొన్నారు.
సొంతింటి కల నెరవేరింది
మాడ్గుల నుంచి 30 ఏండ్ల క్రితం బతుకు దెరువు కోసం గ్రామానికి వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ కిరాయి ఇంట్లో ఉంటున్నాం. కూలితో వచ్చే డబ్బులు తిండి, బట్టకే సరిపోతుంది. నాకు కూతురు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. మాలాంటి పేద వారికి సొంతిల్లు కలగానే ఉండేది. కానీ సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చు లేకుండా మా సొంతింటి కల నెవేర్చారు. అన్ని వసతులతో కూడిన ఇంటిని మాకు ఇచ్చిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి జన్మంతా రుణపడి ఉంటాం.
– లక్ష్మీసాంబయ్య, దండుమల్కాపురం
సొంతిల్లు లేక ఎన్నో కష్టాలు పడ్డాం
మాకు సొంతిల్లు లేక చాల ఇబ్బందులు పడుతున్నాం. చిన్న రేకుల షేడ్డులో ఉంటున్నాం. వర్షం వచ్చినప్పుడు పాములు, తేళ్లు వస్తుండడంతో భయం భయంగా గడిపేవాళం. మా కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసింది. రూపాయి పైసా ఖర్చు లేకుండా సొంతిల్లు అందించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
-కట్టెల రాధమ్మ, లబ్దిదారు, సర్వేల్
సొంతింటి కల తీర్చిన దేవుడు
నాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. కొడుకులు డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నా పెద్దకూతురి పెండ్లికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదుకున్నది. సొంతిల్లు లేక బాధపడుతున్న మాకు డబుల్ బెడ్రూం ఇల్లు అందించి మా కోరికను తీర్చిన దేవుడు సీఎం కేసీఆర్ సార్. ఇవ్వాల గృహప్రవేశం చేస్తుంటే మా ఆనందం మాటల్లో చెప్పలేం. పేదలకు ఆదుకుంటున్న సీఎం కేసీఆర్సార్కు మేమంతా అండగా ఉంటాం.
-చిట్టెంపల్లి వసంతానర్సింహ