మర్రిగూడ, అక్టోబర్ 19 : బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి నిరంతర కొనసాగుతుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులు పూర్తయితే రానున్న రోజుల్లో మునుగోడు నియోజకవర్గం కోనసీమలా పచ్చగా కళకళలాడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమష్టిగా రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
అధికార దాహమే పరమావధిగా ఆలోచిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుట్రలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేసుకున్నామని మరెన్నో కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశామన్నారు. అవన్నీ కొనసాగాలంటే రాష్ట్రంలో మునుగోడులో గులాబీ జెండా ఎగురాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే పార్టీకి, రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది,సంక్షేమ పథకాలతో పాటు బీఆర్ఎస్ మేనిఫెస్టోను సైతం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.
సకల జన సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను రూపొందించారన్నారు. ఈనెల 26న మునుగోడులో నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం అయ్యేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి,జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ, సీనియర్ నాయకుడు మునగాల వెంకటేశ్వర్ రావు, దళితబంధు డైరెక్టర్ లపంగి నర్సింహ, సహకార సంఘం చైర్మన్లు పందుల యాదయ్య, బాలం నర్సింహ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, సర్పంచు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.