నల్లగొండ సిటీ, నవంబర్ 22 : కాంగ్రెస్ నాయకులు మోసపూరిత మాటలు నమ్మి ఓటేస్తే చీకట్లు తప్పవని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కనగల్ మండలం చర్లగౌరారం, మంచినీళ్లబాయి, దర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సంక్షేమ పథకాల లబ్ధ్దిదారులు స్వచ్ఛందంగా ప్రచారంలో ఎమ్మెల్యే వెంట తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టిందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత మ్యానిఫెస్టో ప్రకారం సౌభాగ్యలక్ష్మి పథకంతో మహిళలకు రూ.3 వేల భృతి, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లు రూ.6 వేల వరకు ప్రభుత్వం పెంచనుందన్నారు. తనను ఓడించేందుకు కాంగ్రెస్ నాయకులు డబ్బు సంచులతో దిగారన్నారు. నల్లగొండను దత్తత తీసుకున్న కేసీఆర్ రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచుతానని హమీ ఇచ్చారన్నారు.
నల్లగొండలో మెడికల్ కళాశాల ఐటీ హబ్, బత్తాయి మార్కెట్ను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. సాగుకు 3గంటల కరెంట్ సరిపోతుందని చెప్పిన కాంగ్రెస్ను బొందపెట్టాలన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సభతోనే కాంగ్రెస్ పని అయిపోయిందని జనాలు లేక సభ ప్రాంగణం బోసిపోయిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ వెంకటేశం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ అలుగుబెల్లి నర్సింహరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి,ఎంపీటీసీ నకిరేకంటి సైదులు, దర్వేశిపురం,చర్ల గౌరారం, పర్వతగిరి సర్పంచులు అలుగుబెల్లి పూలమ్మ, చింతల యాదగిరి, చెన్నగోని అంజమ్మారామచంద్రు,ఉపసర్పంచ్ జినుకుంట్ల అంజయ్య, ఆలయ మాజీ చైర్మన్ యాదగిరి నాయకులు శీశైలం ఉన్నారు.