పార్టీలో చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గేట్లు ఎత్తడం కాదు, ముందు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ గేట్లు ఎత్తి సాగు నీరు ఇచ్చి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అనుముల మండలం చల్మారెడ్డిగూడెం, కొట్టాల గ్రామాల్లో నీళ్లు లేక ఎండిపోయిన వరి పొలాలను శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, రవీంద్రకుమార్, మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల రైతులు రోడ్డున పడ్డారని, కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అంతా కరువు అలుముకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణను దోచుకొని ఢిల్లీకి ముడుపులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. సాగునీరు లేక రైతులు ఇలా ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే ఎలాగైనా సరే రైతులకు నీళ్లు అందించేవారని తెలిపారు. పంటలు ఎండిపోతుంటే ఏ ఒక్క మంత్రిగానీ, ఎమ్మెల్యేగానీ కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద టేలాండ్ అనే పదమే వినపడకుండా చివరి భూములకు సాగునీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్క నీటిని కూడా అందించడం లేదని విమర్శించారు.
మేజర్ల వద్ద పోలీసులను కాపలా పెట్టి పాలేరు జలాశయానికి నీళ్లు ఇచ్చారు, కానీ ఇక్కడ ఎండుతున్న పంట పొలాలకు మాత్రం నీళ్లు ఇవ్వలేదన్నారు. ఒక్క తడి నీళ్లిస్తే పంటలు గట్టేక్కేవని తెలిపారు. ఒక్క సాగర్ ఆయకట్టు కిందనే రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన కరెంట్ లేక మోటర్లు కాలిపోతున్నాయన్నారు. జిల్లా మంత్రులు కల్లుతాగిన కోతిలా ఎగిరెగిరి పడుతున్నారని, కానీ రైతు సమస్యలపై పట్టింపు లేదని విమర్శించారు.
మిల్లర్లతో కుమ్మకై మంత్రులు ధాన్యానికి గిట్టు బాటు రాకుండా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల పురుషోత్తం, కేవీ రామరావు, చెన్ను సుందర్రెడ్డి, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, అల్లి పెద్దిరాజు, లక్ష్మణ్నాయక్, చింతకాయల వెంకటేశ్వర్లు, నల్లగొండ సుధాకర్, మెరుగు రామలింగయ్య, దుండిగల్ల నర్సింహ, వడ్డె సతీశ్రెడ్డి, బొమ్మిశెట్టి ఆంజనేయులు, సురభి రాంబాబు, షేక్గౌస్, అబ్దుల్ హాలీం, దోరేపల్లి వెంకన్న, నడ్డి లింగయ్య, అంజత్ఖాన్ పాల్గొన్నారు.