కొండమల్లేపల్లి, ఫిబ్రవరి 2 : రైతుబంధు డబ్బులు పడలేదని అడిగితే చెప్పుతో కొడతారా? కాంగ్రెస్ నాయకులకు ఇంత అహంకారమా? ప్రజలు ఆలోచించాలి.. అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు నామమాత్రంగా రెండు హామీలు అమలు చేసి కాలయాపన చేస్తుందన్నారు.
ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. ఎస్సీ, ఎస్టీ, మహిళా తదితర డిక్లేరేషన్లతో కలిపి 420 హామీలని, అవి అమలు చేయకుంటే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులకు నీలదీయాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వడంలో విఫలమైందని, ప్రస్తుతం 3, 4 గంటలే కరెంట్ ఉంటుందని ఆరోపించారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు ఇవ్వలేని దీన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. చెప్పిన తేదీల్లో రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు నెలకు రూ.2500 భృతి ఇస్తామని చెప్పి మాటిమాటికీ తెలంగాణలో నిధులు లేవనడం సరికాదని పేర్కొన్నారు. లంకబిందెలు దొరుకుతాయని అనుకుంటే, ఖాళీ బిందెలు దొరికాయని సీఎం చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు.
ప్రతి మనిషీ అప్పు చేయడం సహజమని, అలాంటిది రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పు చేయడం తప్పా? అని ప్రశ్నించారు. హామీల అమలుపై దృష్టి పెట్టకుండా పదే పదే అప్పు అంటూ ఆరు గ్యారెంటీల అమలుకు కాలయాపన చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలకే వేల కోట్ల అప్పు తీసుకోలేదా? అని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో నంబర్వన్గా మారిందన్నారు. కేసీఆర్ హయాంలో పదేండ్లు రైతు సంతోషంగా పంటలు పండించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే రైతుల బతుకులు ఆగమవుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపాలను సవరించుకొని గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అనంతరం బీఆర్ఎస్ సర్పంచులను సన్మానించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్రెడ్డి, వడ్త్యా రమేశ్నాయక్, ఎంపీపీలు ప్రతాప్రెడ్డి, మాదవరం సునీత, జడ్పీటీసీ కంకణాల ప్రవీణ, టీవీఎన్ రెడ్డి, హన్మంత్ వెంకటేశ్గౌడ్, మరుపాల సురేశ్గౌడ్, సర్వయ్య, రాజినేని వెంకటేశ్వర్లు, చింతపల్లి సుభాశ్గౌడ్, కేసాని లింగారెడ్డి, రమేశ్నాయక్, నేనావత్ శ్రీనునాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.