నూతనకల్, జూన్ 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికి దిక్సూచిలా మారిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో ఆదివారం నిర్వహించిన మంచినీళ్ల పండుగలో ఆయన మాట్లాడారు. సమైక్య పాలనలో బిందెడు నీళ్ల కోసం మహిళలు మైళ్ల కొద్దీ వెళ్లాల్సి వచ్చేదన్నారు. కరువులో చిక్కుకున్న తెలంగాణలో వర్షం కురిస్తేనే గుక్కెడు నీళ్లు దొరికే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జీవ నదులు ప్రవహిస్తున్నా ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య ఏర్పడిందని విమర్శించారు.
సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ మంచినీళ్లు అందిస్తున్నారని తెలిపారు. మంచినీటి సరఫరాలో దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచినప్పటికీ కేంద్రం నిధుల వాటా కేటాయించలేదన్నారు. మంచినీటి పథకాల విషయంలో ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసి ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పారు. గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాలో మంచి ప్రమాణాలు పాటించినందుకే కేంద్రం నుంచి అనేక అవార్డులు అందాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక, డీఆర్డీఓ సుందరి కిరణ్కుమార్, డీఎస్పీ నాగభూషణం, ఎంపీపీ భూరెడ్డి కళావతి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, తాసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీఓ ఇందిర, సర్పంచులు కొంపెల్లి రాంరెడ్డి, తీగల కరుణశ్రీ, చూడి లింగారెడ్డి, ఎంపీటీసీ పన్నాల రమ, నాయకులు పాల్గొన్నారు.