నూతనకల్, నవంబర్ 8 : తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలో.. అబద్దపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీలు కావాలో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని బక్కహేమ్లాతండా, సోమ్లాతండా, టీక్యాతండా, తాళ్లసింగారం, యడవెల్లి, చిల్పకుంట్ల, వెంకేపల్లి, ఎర్రపహడ్ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని చేసే వాళ్లను ప్రజలు ఆదరించాలని కోరారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే 24 గంటల కరెంట్ ఇవ్వరని, రైతు బంధు బంద్ చేస్తారన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కేసీఆర్ను మరిచిపోవద్దని సూచించారు.
తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తనను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హమీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ప్రసుత్తం రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తుండగా దాన్ని రూ.16 వేలుకు పెంచుతున్నట్లు, కల్యాణలక్ష్మి పథకం కింద రూ.2 లక్షల ఇస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.400కే అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళకు రూ.3 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ చెల్లిస్తామని తెలిపారు. పేదలకు తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
కారు గుర్తుకు ఓటేసి మూడోసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. అంతకుముందు కిశోర్కుమార్ ప్రచార రథంలో గ్రామాలకు రాగా బీఆర్ఎస్ శ్రేణులు బ్యాండ్ మేళాలు, బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికాయి. మహిళలు మంగళ హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, సర్పంచులు గుగులోతు శంకర్నాయక్, లావుడ్య నర్సింహానాయక్, కొంపెల్లి రాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, గోరుగంటి మోహన్రావు, బిక్కి బుచ్చయ్య, మట్టిపెల్లి గంగయ్య, తాడూరి లింగయ్య, బద్ధం ప్రశాంత్రెడ్డి, బత్తుల విద్యాసాగర్, బత్తుల విజయ్, పులుసు లింగమల్లయ్య, గాడ్దుల లింగరాజు పాల్గొన్నారు.