మద్దిరాల, నవంబర్ 4 : తుంగతుర్తి ప్రాంతం 2014కు ముందు ఎట్లుండే.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎట్లా మారిందో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి, ఎమెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రెడ్డిగూడెం, రామచంద్రాపురం, గుమ్మడవెల్లి, చందుపట్ల, కుంటపల్లి, కుక్కడం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు కాంగ్రెస్ పాలనలో తుంగతుర్తి ప్రాంతంలో రక్తం పారి గోరిలే దర్శనమిస్తుండేవని.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పారిస్తున్న కాళేశ్వరం నీళ్లతో ధాన్యపు రాశులు దర్శనమిస్తున్నాయన్నారు. 2014, 2018లో ఉద్యమ రథసారధి, తెలంగాణ ప్రగతి నిర్మాత సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చి ఈ ప్రాంతానికి పంపితే మీ బిడ్డగా ఆదరించి సేవచేసే భాగ్యం కల్పించినట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో తుంగతుర్తిని మరింత అభివృద్ధి చేయడానికి మరొక అవకాశం ఇవ్వాలని కోరారు. 2014కు ముందు తుంగతుర్తి గడ్డ కక్ష్యలు, కొట్లాటలు, నిత్యం గొడవలతో అల్లకల్లోలంగా ఉండేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తుంగతుర్తి గడ్డకు కాళేశ్వరం జలాలు తీసుకువచ్చి రైతులకు, రైతు కూలీలకు చేతినిండా పని కల్పించడంతో గొడవలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. నియోజక వర్గంలో లక్ష యాభై వేల ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందుతున్నాయంటే సీఎం కేసీఆర్ కృషి వల్లే జరిగిందని వివరించారు. ముప్పై, నలభై ఏండ్ల నుంచి నిండని చెరువులు ఎండకాలంలోనైనా, చలికాలంలోనైన మత్తడి దుంకుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ ఆలోచనలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్తోనే సాధ్యపడిందన్నారు.
తుంగుతుర్తిలో వంద పడకల ఆస్పత్రి, రహదారులు, జాతీయ రహదారులు తీసుకువచ్చి దూర ప్రయాణాన్ని దగ్గర చేయడం జరిగిందని వివరించారు. రైతాంగానికి సాగునీరు, 24 గంటల కరెంట్, పంట పెట్టుబడికి సాయం, పండిన పంటను సైతం ప్రభుత్వం మద్దతు ధరతో కొనడం జరుగుతుందని చెప్పారు. నియోజక వర్గంలో 93 వేల మందికి రైతు బంధు, 53 వేల మందికి ఆసరా పెన్షన్లు, 11 వేల మందికి కల్యాణలక్ష్మి, 8 వేల మందికి కేసీఆర్, న్యూట్రిషన్ కిట్లు అందిచండం జరిగిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే ముచ్చటగా మూడోసారి కారు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని మండల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, ఎంపీపీ గుడ్ల ఉపేంద్రావెంకన్న, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా నాయకులు మల్లు కపోతంరెడ్డి, ఆకుల ఉప్పలయ్యగౌడ్, కన్న వీరన్న, తీగల వెంకన్న, కోడి శ్రీను, ఎంపీటీసీ నాగెల్లి శ్రీలతాశ్రవణ్కుమార్, మారెల్లి యాకయ్య, వెంకట్రెడ్డి, వడ్డాణం మధుసూదన్, మల్యాల నర్సయ్య, గుండ్ల నాగయ్య, మల్లు ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.
సర్పంచ్ ప్రణీతరెడ్డి
తుంగతుర్తి : మండలంంలోని బండరామారం గ్రామంలో సర్పంచ్ ఉప్పునూతల ప్రణీతరెడ్డి అత్త సుకన్యాదేవి మృతిచెందారు. భౌతికకాయాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుం బ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన ఎర్రోజు నారాయణ, కొడిదల ఎల్లయ్య ఇటీవల మరణించగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.