అర్వపల్లి, నవంబర్ 15 : తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు.. మరోమారు ఆశీర్వదించి అభివృద్ధికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రజలను కోరారు. బుధవారం మండలంలోని కాసర్లపహాడ్, కొమ్మాల, నాణ్యతండా, లోయపల్లి, కోడూరు, సూర్యనాయక్తండా, కోమటిపల్లి, తిమ్మాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేల కోట్లతో తుంగతుర్తి నియోజక వర్గ రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. ఆరు మండలాలకు కలిపి 95 వేల ఎకరాలకు కాళేశ్వరం జలాలు తీసుకువచ్చి రైతుల కాళ్లు కడిగినట్లు చెప్పారు. నియోజక వర్గంలో 50 వేల మందికి ఆసరా పెన్షన్లు, 95 వేల మందికి రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అనేక రకాల సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందించినట్లు వివరించారు. ఎన్నికల తర్వాత తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, కేసీఆర్ బీమా, 400కే గ్యాస్ సిలిండర్ అందించడంతో పాటు గృహలక్ష్మి, బీసీ బంధు, దళిత బంధును అర్హులైన వారికి దశల వారీగా అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 30న జరిగే ఎన్నికల పోలింగ్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఒకప్పుడు కక్షలతో, రక్తపు మరకలతో రగిలిన నియోజక వర్గం నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ప్రశాంత వాతావరణం మధ్య జీవిస్తున్నట్లు చెప్పారు. అందుకు చిహ్నంగా కొమ్మాలలో ఎమ్మెల్యే శాంతి కపోతాన్ని ఎగురవేశారు. 3 గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? లేక 24 గంటల కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతు తెలుపుదామో రైతులు ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, వైస్ ఎంపీపీ మారిపెద్ది భవానీశ్రీనివాస్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, ఎంపీటీసీ బొడ్డు భద్రమ్మ, గుండగాని సోమేశ్గౌడ్, రామలింగయ్య, మొరిశెట్టి ఉపేందర్, గ్రంథాలయ చైర్మన్ పి.యుగేంధర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.