మోత్కూరు, నవంబర్ 27 : బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే కిశోర్కుమార్ తెలిపారు. మిగిలిన ప్రగతిని పూర్తి చేయడానికి తనకు మరోసారి అవకాశం కల్పించి ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. సోమవారం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి ఆలయం నుంచి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు ఇచ్చి, కోలాటం ఆట పాటలతో అపూర్వం స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో తుంగతుర్తిని పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించాలని కోరారు. 2014, 2018లో ప్రజల తిరస్కరణకు గురైన కాంగ్రెస్ నాయకులు మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లోనే కనిపిస్తున్నట్లు చెప్పారు. పదేండ్లలో ఏ ఒక్క రోజు నియోజక వర్గం ప్రజల బాగోగులు పట్టని కాంగ్రెస్ ఓట్ల ఎన్ని జిమ్మిక్కులు చేస్తుందో గమనించాలన్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వరన్నారు. రైతు బంధును బంద్ చేస్తారని విమర్శించారు. బునాదిగాని కాల్వ అసంపూర్తి పనులను పూర్తి చేసి బస్వాపురం ప్రాజెక్ట్కు అనుసంధానం చేసి మోత్కూరు, అడ్డగూడూరుకు కాళేశ్వరం జలాలను తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.
మోత్కూరు మున్సిపాలిటీని ఏర్పాటు చేసుకుని జిల్లాలోనే అత్యధిక నిధులను మంజూరు చేయించి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మోత్కూరు-గుండాల బిక్కేరు వాగుపై నూతన వంతెన నిర్మాణానికి కృషి చేయనున్నట్లు, పట్టణంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంను మరింత అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవకుడిగా పని చేస్తున్న తనను ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ సీఎం కావడం కోసం ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి తనకూ ఎమ్మెల్యే అవకాశం కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నియోజక వర్గం రాజకీయ పరిశీలకుడు నేవూరి ధర్మేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటయ్య, బీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీల అధ్యక్షులు పొన్నెబోయిన రమేశ్, కల్యాణ్చక్రవర్తి, నార్మాక్స్ డైరెక్టర్ కల్పనాలక్ష్మీనర్సింహారెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ అశోక్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొణతం యాకూబ్రెడ్డి, కెవ్వు కేక ఆర్టిస్ట్ కార్తీక్, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు పాల్గొన్నారు.
తుంగతుర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధికి అండగా ఉండేందుకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం గానుగుబండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కట్ల వెంకట్రాములు, తుంగతుర్తి గ్రామ వార్డు సభ్యురాలు మద్దెల సరిత, అన్నారం గ్రామానికి చెందిన పలువురు నాయకులు,
మోత్కూరు మున్సిపల్ 6వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కందుకూరి నర్సయ్య, బీఎస్పీ మున్సిపల్ అధ్యక్షుడు గజ్జెల్లి యాదగిరి, కందుకూరి సాయిలు, పందుల నరేశ్, కొంపెల్లి యశోబ్తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, గుండగాని రాములుగౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నల్లు రాంచంద్రారెడ్డి, చెరుకు పరమేశ్, తడకమళ్ల రవికుమార్, బొజ్జ కిరణ్, దుర్గయ్య, శ్రీహరి పాల్గొన్నారు.