నల్లగొండ : రాజకీయ పునాదులు వేసిన బ్రాహ్మణవెల్లెంల గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. గ్రామంలో మట్టి రోడ్డు లేకుండా చేయాలన్నదే నా సంకల్పం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో రూ. 1.20 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పలు ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేసి మాట్లాడారు.
మీ అందరి ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ ఇంటి బిడ్డగా కష్టాల్లో, సుఖాల్లో ఎప్పటికీ నేను తోడుంటానన్నారు. ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడా చెడ్డ పేరు రాకుండా మన ఊరి గౌరవం పెరిగేలానే పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అది కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. అడగకుండానే ఆత్మ గౌరవ భవనాలకు రూ. కోటి నిధులు మంజూరు చేసాం.
ఊరికి నలువైపులా బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాన్నారు. ఈ కార్యక్రమలో జెడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ యానాల మాధవి అశోక్ రెడ్డి, ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య పాల్గొన్నారు.