మూసీ ఆయకట్టుకు మంగళవారం నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ కాల్వలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గేట్లు ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 641.95 (3.68 టీఎంసీలు) అడుగులు ఉన్నది.
– కేతేపల్లి, జూలై 18
కేతేపల్లి, జూలై 18 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు అధికారులతో కలిసి మంగళవారం ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. స్వ రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు.మంత్రి జగదీశ్రెడ్డి జన్మదిన రోజున ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు.
రైతు వ్యతిరేకి రేవంత్రెడ్డి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతుల పట్ల ద్రోహిలా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తూ రేవంత్రెడ్డి ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేస్తున్నప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 100 సీట్లతో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమాల్లో ప్రాజెక్టు ఎస్ఈ శివధర్మతేజ, ఈఈ భద్రునాయక్, డీఈ చంద్రశేఖర్, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, ఏఈలు ఉదయ్కుమార్, మమత, స్వప్న, బొప్పారం సర్పంచ్ కర్ర ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, నాయకులు చల్లా కృష్ణారెడ్డి, కె.సైదులుగౌడ్, గోలి వేణుమాధవరెడ్డి, కె.లింగయ్యయాదవ్ పాల్గొన్నారు.
మూసీ నీటిమట్టం 641.95
మూసీ ప్రాజెక్టు నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 641.95(3.68 టీఎంసీలు) అడుగులు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 142.26 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు కుడి కాల్వకు 100 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 100 క్యూసెక్లు ఔట్ ఫ్లో వెళ్తున్నది. ప్రాజెక్టు నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) ఉంది.