కోదాడ, నవంబర్ 8 : చీకటి ఒప్పందంతో మూడు దశాబ్దాలుగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న ఉత్తమ్, చందర్రావు అరాచక రాజకీయానికి చరమగీతం పాడాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కోదాడ ప్రధాన రహదారిపై కార్యకర్తల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కొందరు నాయకులు డబ్బు సంచులతో సంతల్లో గేదెల మాదిరి చోటా మెటా నాయకులను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవాలన్నీ గమనిస్తున్నారని తెలిపారు. కోదాడకు పట్టిన చీడపురుగుల బాగోతం బట్టబయలైందన్నారు.
తామిద్దరూ తప్ప వేరేవరు ఇక్కడ గెలవకూడదని అక్కసుతో ప్రత్యర్థులుగా నటించిన ఇద్దరు ఒక్కటయ్యారనే వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. 2009లో మైనార్టీ నాయకుడిని ఎన్నికల బరిలో నిలిపి ఓడించిన ఘనత ఉత్తమ్దైతే 2014లో సొంత పార్టీలోనే ఉంటూ పక్కలో బల్లెంలా అంతర్గత సమాచారాన్ని ఉత్తమ్కు అందించి తనను ఓడించిన విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఆరు నెలలకోసారి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చే టూరిస్టుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
కరోనా కష్టకాలంలో రెండేండ్ల పాటు నియోజకవర్గ ప్రజలు చావు బతుకుల మధ్యలో బిక్కుబిక్కుమంటుంటే కనీసం పరామర్శించడానికి సైతం ఇక్కడకు రాని నాయకురాలు ప్రస్తుతం ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. 24గంటలు అందుబాటులో ఉండే తనను భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి శశిధర్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను మూడోసారి గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికలో మల్లయ్యయాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కోవర్టు నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ కోదాడ అభ్యర్థి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఆ పార్టీ మాజీ ఇన్చార్జి శశిధర్రెడ్డి, పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడు వనపర్తి లక్ష్మీనారాయణతో కలిసి బుధవారం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మల్లయ్యయాదవ్ నామినేషన్ వేశాక ఖమ్మం రోడ్డు నుంచి బయలుదేరిన ర్యాలీ తెలంగాణ చౌరస్తా వరకు సాగింది. మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహానికి మల్లయ్యయాదవ్ పూలమాల వేశారు. ర్యాలీలో పార్టీ శ్రేణులు కేసీఆర్ జిందాబాద్, మల్లన్న గెలుపు ఖాయమని నినాదాలు చేశారు.
తండాలను గ్రామపంచాయతీలుగా
చిలుకూరు : గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని జానకీనగర్, దూదియతండా, సీత్లాతండా, నారాయణపురంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కొండా సైదయ్య, నాయకులు దొడ్డా సురేశ్, బట్టు శివాజీ, జానిమియా, నందలాల్, వాసు, కృష్ణచైతన్య, అల్సకాని జనార్దన్, శంకర్, బాషం సైదులు, బెల్లంకొండ నాగయ్య, లింగరాజు, పాష పాల్గొన్నారు.