మోతె, నవంబరు 17 : బీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండలంలోని నామవరం, రాఘవపురం, లాల్తండా, బల్లుతండా, సిరికొండ, రావిపహాడ్, అప్పన్నగూడెం, రాంపురం తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబీ జెండానే నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. మండలంలో ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
కోదాడలో ఇప్పటి వరకు నిర్వహించిన అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే జరిగిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, మద్దతు ధర, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం పండుగలా మారిందన్నారు. నాడు కరెంట్ కోసం రోడ్లెక్కితే ప్రస్తుతం 24గంటల కరెంట్తో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కోదాడ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ఎలాంటి గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పారీ మాటలు నమ్మి మోసపోద్దని ప్రజలకు సూచించారు.
ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వీరంతా ఎక్కడికి పోయారన్నారు. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, పచ్చిపాల వేణుయాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు శీలం సైదులు, మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వర్రావు, సొసైటీ చైర్మన్లు వెంకట్రెడ్డి, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.