కోదాడటౌన్, నవంబర్ 26 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా వార్డుల ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంగళ హారతులతో స్వాగతించి గజమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతుండడంతో ప్రజలు రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్కు మద్దతునిస్తున్నారన్నారు. సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ రాజీపడే ప్రసక్తే లేదని, పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. తాను ఐదేండ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ కష్టనష్టాల్లో ప్రజలకు తోడుగా ఉంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తనకకు రెండో సారి అవకాశం ఇచ్చినందున మీరందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మామధుసూదన్, పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, మహిళా విభా గం పట్టణ అధ్యక్షురాలు ఇర్ల రోజారమణి, కౌన్సిలర్లు, మౌలానా, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.