చిలుకూరు, నవంబర్ 11 : కోదాడ నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాలను అభివృద్ధి చేసిన తాను మరలా రెండోసారి మీ బిడ్డగా వస్తున్నా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలను కోరారు. శనివారం ఆయన మండలంలోని పోలేనిగూడెం, బేతవోలు, చెన్నారిగూడెం, ఆచార్యులగూడెం, జెర్రిపోతులగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రైతును రారాజు చేసింది సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు. రైతులకు రైతుబం, నాణ్యమైన విద్యుత్, సాగునీరు, మద్దతు ధర ఇవ్వడంతో రాష్ట్రంలోని రైతుల బతుకులు మారాయన్నారు. గత ప్రభుత్వాల్లో కరెంటు లేక పొలాల దగ్గర పడుకున్న రోజులు మరలా కావాలా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకుల టికెట్లకే గ్యారెంటీ లేదుగాని వారు గ్యారంటీ పథకాలు ఇస్తామంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రామాల్లోని కొందరు నాయకులు బీఆర్ఎస్తో లబ్ధి పొంది కాంగ్రెస్ డబ్బు సంచులకు అమ్ముడుపోయారని వారిని నమ్మి మరోసారి మోసపోకండని సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి చూసి తనకు ఓటేయాలని కోరారు. గత ప్రభుత్వాల్లో గ్రామాలు పెంటదిబ్బలు, ముళ్ల కంపచెట్లతో దర్శినమిచ్చేవని, ప్రస్తుతం సకల మౌలిక వసతలతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు నిర్మించి ప్రజలకు ఇబ్బందుల లేకుండా చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ వారికి ఓటేస్తే గెలిచాక హైదరాబాద్, బెంగుళూరులో ఉంటూ ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు.
టూరిస్టు నాయకులను నమ్మతే అరిగోస పడుతామని పేర్కొన్నారు. గ్రామాల్లో అర్హులందరికీ పింఛన్లు ఇచ్చామని, మరలా బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ.3వేలు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టులో భాగంగా రేషన్ కార్డు ఉండి అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. రూ.400లకే గ్యాస్ ఇస్తామన్నారు. మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరుతో ప్రతినెలా రూ.3వేల నగదు ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలనే రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. అనంతరం ఆచార్యులగూడెం వెళ్తున్న దారిలో హమాలీలు ధాన్యాన్ని బస్తాల్లో నింపుతుండడం చూసి కారు దిగి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ సైతం వారితో కలిసి బస్తాల్లో ధాన్యం నింపారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కొండా సైదయ్య, నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, దొడ్డా సురేశ్, శివాజీ, తాళ్లూరి శ్రీను, కొవ్వూరి వెంకటేశ్వర్లు, జానకీరామాచారి, ఎలుగూరి నాగరాజు, పనస గోపి, ఉపేందర్, అంబాల రాంబాబు, లింగరాజు, పాష పాల్గొన్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పర్యటనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మల్లయ్యయాదవ్కు తిలకందిద్ది హారతినిచ్చారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
నడిగూడెం : బీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన మండలంలోని కరివిరాల, వెంకటరామాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోద్దని ప్రజలకూ సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గ్రామాలు ప్రస్తుతం అన్ని రకాల మౌలిక వసతులతో కళకళలాడుతున్నాయి. మీ వాడిగా తను ఆశీర్వదించాలని కోరారు. కొందరు కరివిరాల గ్రామాభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. తన స్వగ్రామంలో ప్రతి ఇంట్లో అన్నలా, తమ్ముడిలా సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, పార్టీ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, పాలడుగు ప్రసాద్, అనంతుల ఆంజనేయులు, అనంతుల మహేశ్, మహేశ్రెడ్డి, సురేందర్రెడ్డి, నాగేశ్వర్రావు, ఖలీల్ అహ్మద్, కృష్ణ పాల్గొన్నారు.