అడవిదేవులపల్లి, జూలై 7 : స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో శుక్రవారం మండలానికి చెందిన 125 మందికి పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ వందల ఏండ్లుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ, గిరిజనులను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు.
కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు పట్టాలు అందించి ఆదుకుందని చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్ల సాధ్యమైందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే వ్యవసాయం పండుగగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చెన్నయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యానాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కూరాకుల చినరామయ్య తదితరులు పాల్గొన్నారు.