నల్లగొండ: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మన ఊరు – మన బడి.. కార్యక్రమమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. ఆదివారం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేట గ్రామంలో 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి పిల్లలే రేపటి పౌరులని, వారి భవిష్యత్ బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రూ.7,300 కోట్ల కేటాయించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్య, వసతులను ఉచితంగా అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ చైర్మన్ వెంపటి పార్వతమ్మ ,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజయేందర్ రెడ్డి ,ఎడమకాల్వ మాజీ వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ యెడవెల్లి నీలిమ, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, ఎంఈఓ బాలునాయక్, వార్డు కౌన్సిలర్ లు నల్లబోతు వెంకటయ్య అన్నే పాక శ్రీను, ప్రసాద్ నాయక్, వర్రా వెంకట్రెడ్డి చాపల సైదులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు దొర పల్లి వెంకటయ్య, కాట్నం నాగరాజు, సురభి రాంబాబు, లింగాల సైదులు తదితరులు పాల్గొన్నారు.