దామరచర్ల, జనవరి 7: గ్రామాల్లో ఆలయాల అభివృద్ధ్దికి దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి కోరారు. మండలంలోని కొండ్రపోల్ నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న మైసమ్మ ఆల యం వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆదివారం ప్రారంభించారు.
హైవే పక్కనే ఉన్న ఆమ్మవారి ఆలయం వద్ద రాత్రి వేళల్లో భక్తులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంటు పగిడి జీడయ్య యాదవ్ రూ. లక్ష వ్యయం తో ఈ లైట్లను ఏర్పాటు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యేను, జీడయ్యను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, సర్పంచ్ పరంగి రాంబాబు, నాయకులు గాజుల శ్రీనివాస్, వేణుగోపాల్రెడ్డి, వెంకన్నయాదవ్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ : దశరథ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థ్ధులకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలు వంటి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ హాజరై ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ స్వయంపాకుల విశ్వనాథవర ప్రసాద్, ఎంఈఓలు బాలాజీనాయక్, బాలు, పాఠశాల హెచ్ఎం ధర్మనాయక్, నాయకులు స్కైలాబ్నాయక్, నూకల వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.