నల్లగొండ, ఫిబ్రవరి 11 : రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగానే మందుకు సాగుతున్నదని, రైతాంగం సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన అధ్యక్షతన నల్లగొండ జిల్లా పరిషత్ సమావేశం ఈ సందర్భంగా బండ మాట్లాడుతూ ఇటీవల కరంట్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతున్నదని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా, కొన్ని స్వల్ప కారణాల వల్ల అంతరాయం ఏర్పడిందని వివరించారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంటలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రధానంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండి కరెంట్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సమయంలో అధికారులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గౌరవించి ప్రొటోకాల్ను పాటించాలన్నారు.
దేశంలోనే గొప్ప పథకం మిషన్ భగీరథ : ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
మిషన్ భగీరథ పధకం దేశంలోనే గొప్ప పథకమని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.45వేల కోట్లు వెచ్చించిందని ఎంపీ బడుగుల లింగయయ్యయాదవ్ అన్నారు. ఇంటింటికి నీరు ఇవ్వడంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య తీరిందన్నారు. వచ్చేది వేసవి కనుక అధికారులు ఎక్కడైన నీటి సమస్య ఉన్నదా లేదా అని పరిశీలించి ముందస్తుగానే సమస్యను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. మిషన్ భగీరథ వచ్చాక బావులు, బోర్ల నీటి వినియోగం పూర్తిగా తగ్గిందన్నారు. కొన్ని మండలాల్లో ఆర్అండ్బీ రోడ్లు గుంతలు పడినందున వాటిని మరమ్మతులు చేయించాలన్నారు. వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ఆ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సొంత జాగా ఉన్న వారికి ప్రభుత్వం రూ.3లక్షలు ఇస్తున్నందున పథకం కింద అర్హులను ఎంపిక చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలి :కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి
జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఇక నుంచి డీఆర్వోకి సమాచారం ఇచ్చి వారి అనుమతితోనే శిలాఫలకాలు పెట్టాలని కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి ఆదేశించారు. ప్రొటోకాల్ నిబంధన తప్పని సరిగా పాటించాలని లేనిచో సంబంధిత అదికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రొటోకాల్ సమస్యలు ఉంటే ఎంపీపీలు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి కాపీ పంపాలని సూచించారు. అధికారులు తప్పనిసరిగా మండల, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరు కావాలని, ఏ కారణం చేతనైన హాజరుకాకపోతే మండలాల్లో ఎంపీపీ, జిల్లా స్థాయిలో జడ్పీ చైర్మన్ అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్ఆర్ఈజీఎతో ఈ ఏడాది నల్లగొండ డివిజన్లో 317పనులకు రూ.40.64కోట్లు , మిర్యాలగూడలో 218 పనులకు రూ.20.41కోట్లు మంజూరైనందున ఆ నిధులతో సీసీ మెటల్ పనులు చేస్తున్నట్లు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
కొన్ని శాఖల అధికారులు ప్రొటోకాల్ పాటించట్లేదని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు తమకు సమాచారం ఇవ్వట్లేదని దేవరకొండ, పెద్దవూర ఎంపీపీలు దుమారం లేపారు. దానికి స్పందించిన కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని భవిష్యత్లో ఇలాంటి సమస్యలు రాకుండా చూస్తామని హామీనిచ్చారు. అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని శిలాఫలకాల్లో సైతం ఎంపీపీలు, జడ్పీటీసీల పేర్లు ప్రస్తావించాలని అధికారులకు సూచించారు. పెద్దవూర ఎంపీడీఓ మద్యం తాగి డ్యూటీకి వస్తున్నారని ఎంపీపీ ఆరోపించింది. అర్హులైన వారికి పింఛన్ రావట్లేదని, కొందరికి ఒక నెల పింఛన్ వచ్చి ఆగిపోయినందున వాటిని పునరుద్ధరించాలని కనగల్ ఎంపీపీ కోరారు. లైన్మెన్లు మండల కేంద్రాల్లో అందుబాటులో లేకపోవటంతో కరెంట్ స్తంభం మీద ప్యూజ్పోతే సైతం వేసే దిక్కులేదని తిప్పర్తి జడ్పీటీసీ అన్నారు.
ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఎన్ని వచ్చాయనే విషయం జడ్పీటీసీలకు ఎందుకు చెప్పట్లేదని ఆయన డీఆర్డీఏ అధికారులను నిలదీశారు. ఇందిర జలప్రభ కింద బోర్ మోటార్కు రూ.3లక్షలు దాటితే నిధులు ఇవ్వట్లేదని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా గిరి వికాస్ పథకంపై అవగాహన కల్పించాలని పెద్దవూర జడ్పీటీసీ కోరారు. మిషన్ భగీరథ కింద అన్ని గ్రామాలకు శుద్ధి జలాలు రావట్లేదని, వేసవి వస్తున్నందున నీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. కొన్ని పాఠశాలల్లో మిషన్ భగీరథ నీరు రావట్లేదని చందంపేటలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఎంపీపీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నెలకు సరిపడా ఉచితంగా సరఫరా చేస్తున్న బీపీ, షుగర్ మాత్రలను చైర్మన్, కలెక్టర్, ఎంపీ ప్రారంభించారు. తొలిసారిగా సభకు హాజరైన కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.