Mission Bhagiratha | సూర్యాపేట, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : మిషన్ భగీరథ పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. ప్రతి ఒక్కరికీ 100 నుంచి 125 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకం ద్వారా సూర్యాపేట పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. సూర్యాపేట జిల్లాలో పారే కృష్ణా, గోదావరి నదీ జలాలను సేకరించి వాటిని శుద్ధి చేసి నల్లాల ద్వారా ప్రతి ఇంటికీ అందిస్తున్నారు. దాంతో ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి.
టెయిల్ పాండ్ నుంచి
అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామం వద్ద ఉన్న టెయిల్పాండ్ నుంచి 1040 హెచ్పీ మోటార్ల ద్వారా కృష్ణానీటిని నేరుగా అవంతీపురం వద్ద ఏర్పాటు చేసిన నీటిశుద్ధి ప్లాంట్కు తరలిస్తున్నారు. రోజుకు 185 ఎంఎల్డీల నీటిని తరలిస్తుండగా.. వీటిలో 90 ఎంఎల్డీల నీటిని శుద్ధి చేసి 1100 హెచ్పీ మోటారుతో కాల్వపల్లి గుట్టపైకి పంపించి నల్లగొండ జిల్లా మిర్యాలగూడతో పాటు హుజూర్నగర్ నియోజకవర్గాలకు ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. మిగిలిన 95 ఎంఎల్డీల నీటిని అవంతీపురం నుంచి 1250 హెచ్పీ మోటార్లతో సూర్యాపేట మండలం ఇమాంపేటకు పంపించి అక్కడ సంప్లో చేర్చి ఇమాంపేట ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేస్తున్నారు. అనంతరం 900 హెచ్పీ మోటార్లతో పక్కనే ఉన్న ఉండ్రుగొండ గుట్టపైకి నీటిని తరలించి సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ గ్రావిటీ ద్వారా అందిస్తున్నారు. మండు వేసవిలోనూ ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ జలాలు నిత్యం అందుతున్నాయి.
మూడు దిక్కుల నుంచి
నాగార్జునసాగర్ నుంచి హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలతో పాటు పాలేరు నుంచి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు, దాంతో పాటు జనగాం జిల్లా సింగరాజుపల్లి పంప్హౌస్ నుంచి జీహెచ్ఎంసీకి తాగునీటిని తీసుకువెళ్లే పైపులైన్ నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
మంత్రి జగదీశ్రెడ్డి కృషితో సూర్యాపేటకు తాగునీరు
గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ మురుగునీటితో కలుషితమైన మూసీ నీటినే సూర్యాపేట ప్రజలకు తాగునీటిగా అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మంత్రి జగదీశ్రెడ్డి ఈ సమస్యను పరిష్కరించేందుకు సంకల్పించారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి ఏకంగా శ్రీశైలం నుంచి ఉదయ సముద్రానికి నీటిని విడుదల చేయించి అక్కడి నుంచి ప్రత్యేకంగా కాల్వలు తీయించి మూసీకి కృష్ణాజలాలు తీసుకువచ్చారు. ఆ నీటితో మూసీని శుద్ధి చేసి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించారు.
అంతటితో ఆగకుండా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేయించి అప్పటికే అడుగంటిపోయిన దోసపాడు చెరువుతో పాటు మరికొన్ని చెరువులను నింపించి సూర్యాపేట పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చారు. తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథతో నేడు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సూర్యాపేట మండలం ఇమాంభ్పటలోని మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద 5 వేల మందితో నీటి దినోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందులో భాగంగా మిషన్ భగీరథ పథకంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
భగీరథ మొదటి ఫలితం తిరుమలగిరికే
తిరుమలగిరి : కొమురవెల్లి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను జనగాం జిల్లాలోని సింగరాజుపల్లి గ్రామానికి మళ్లించి అక్కచి నుంచి తిరుమలగిరి గుట్టపై నిర్మించిన ట్యాంకులోకి తరలించారు. 52 ఆవాసాలకు 68 కిలోమీటర్లు పైపులైన్ పూర్తిచేసారు. 55 ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులు నిర్మించారు. నూతనకల్ మండలంలోని చిల్పకుంట్ల వద్ద నీటిశుద్ధి కేంద్రాన్ని కూడ నిర్మించారు. ప్రస్తుతం ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మిషన్ భగీరథ మొదటి ఫలితం తిరుమలగిరికే అందింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రూ. 200 కోట్లతో పనులు చేపట్టారు. తిరుమలగిరి మండలానికి సింగరాజుపల్లి వద్ద నిర్మించిన పంపుహౌస్ నుంచి గోదావరి జలాలు అందిస్తున్నారు. తాగునీటి కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గం ప్రజల దాహర్తి తీరడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.