శ్రీనివాసనగర్ గ్రామపంచాయతీ 2018లో కొత్తగా ఏర్పడింది. ఈ గ్రామంలో 371 ఇండ్లు ఉండగా.. గ్రామస్తులు బోగవిల్లి వెంకటరమణచౌదరిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న ఆయన.. ఊర్లోని యువకులను ఏకం చేసి ప్రతి పనిలో భాగస్వాములను చేస్తున్నారు. పల్లె ప్రగతి ద్వారా పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, హరితహారం ప్లాంటేషన్, నూతన పంచాయతీ భవన నిర్మాణం చేపట్టారు. గ్రామం నుంచి సేకరించే చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నది. దీంతో పారిశుధ్యం మెరుగు పడడంతోపాటు ఆదాయం పొందుతూ ఆదర్శ గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకున్నది.
మిర్యాలగూడ రూరల్, జూలై 19 : ఆ గ్రామపంచాయతీ కొత్తగా ఏర్పడినా.. అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో కంపోస్టు యార్డు ఏర్పాటు చేసి ఇంటింటికీ చెత్త సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నది. దాన్ని గ్రామంలోని మొక్కలకు వాడడంతోపాటు మిగిలిన ఎరువును విక్రయించి ఆదాయం పొందుతున్నది మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్నగర్ గ్రామ పంచాయతీ.
సేంద్రియ ఎరువు తయారీ
గ్రామంలో ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఒక బుట్టలో తడి చెత్త, మరో దాంట్లో పొడి చెత్త వేసేలా గ్రామపంచాయతీ వారు ప్రజలకు అవగాహన కల్పించారు. పంచాయతీ కార్మికులు ఆదివారం చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తను వేర్వేరుగా పోసి ప్లాస్టిక్ బాటిల్స్, డబ్బాలు, గాజు సీసాలను వేరు చేస్తారు. తడి చెత్తను డంపింగ్ యార్డులో నిర్మించిన రెండు నాడెపు కంపోస్టు పిట్స్లో వేస్తారు. దానిపై నీళ్లు చల్లి 30-40 రోజులు మాగబెడుతారు. దానికి కొంత మట్టి చేర్పి అందులో వానపాములను ప్రవేశపెడుతారు. మరో 40 రోజులకు కంపోస్టు ఎరువు తయారవుతుంది. అనంతరం బయటకు తీసి బస్తాల్లో నింపుతారు.
శ్రీనివాస్నగర్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ
రూ.200కు 25 కిలోల ఎరువు
డంపింగ్ యార్డులో తయారైన కంపోస్టు ఎరువును గ్రామ పంచాయతీ పరిధిలోని హరితహారం, పల్లె ప్రకృతి వనం మొక్కలకు వాడుతారు. మిగిలిన ఎరువును శ్రీనివాస్నగర్ (ఎస్ఆర్ఎన్) బ్రాండ్తో 25 కిలోల బస్తాను రూ.200కు విక్రయిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని అపార్ట్మెంట్లు, ఇండ్లల్లో, పరిశ్రమ ప్రాంగణంలో మొక్కలు పెంచేవారు ఈ ఎరువును కొనుగోలు చేస్తున్నారు. 9 నెలల్లో ఎరువు విక్రయించగా.. రూ.1.05 ఆదాయం వచ్చినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.
పొడి చెత్త సేల్..
గ్రామంలో సేకరించిన తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేస్తుండగా.. పొడి చెత్తను రీసైక్లింగ్ వారికి అమ్ముతున్నారు. పొడి చెత్తలో వచ్చిన ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగులు, పాస్టిక్ బొమ్మలను వేరు చేస్తారు. గాజు సీసాలు, ఇతర వస్తువులను రీసైక్లింగ్ చేసే వారికి అమ్ముతారు. ఆ విధంగా పొడి చెత్త నుంచి సైతం ఆదాయం పొందుతున్నారు.
ఎస్ఎన్ఆర్ బ్రాండ్ పేరుతో బస్తాల్లో నింపిన కంపోస్ట్ ఎరువు
పారిశుధ్యంతోపాటు ఆదాయం
గ్రామంలో ఇండ్ల నుంచి చెత్త సేకరించేదుకు ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలను మూడు సంవత్సరాల క్రితమే పంపిణీ చేశాం. చెత్తను తప్పనిసరిగా బుట్టల్లోనే వేయాలని, లేదంటే జరిమానా విధిస్తామని నిబంధన పెట్టాం. ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలించడం వల్ల గ్రామంలో పారిశుధ్యం పూర్తిగా మెరుగు పడింది. దోమల బెడద తగ్గింది. అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించగలిగాం. తడి చెత్తను కంపోస్టు ఎరువుగా చేసి విక్రయించడంతో గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తున్నది.
– బొగవిల్లి వెంకటరమణచౌదరి, సర్పంచ్, శ్రీనివాస్నగర్
అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలి
శ్రీనివాస్నగర్ గ్రామ పంచాయతీని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీనివాస్నగర్ డంపింగ్యార్డులో గ్రామంలో సేకరించిన తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. దాన్ని గ్రామంలో నాటే మొక్కలకు వాడడంతోపాటు మిగిలిన ఎరువును మార్కెట్ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో డంపింగ్ యార్డు నిర్మించాం. చెత్త సేకరణకు ట్రాక్టర్ ఉంది. అన్ని గ్రామాల కార్యదర్శులు శ్రీనివాస్నగర్ను సందర్శంచి చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించాలి. అన్ని గ్రామాలు దానిని అనుసరిస్తే బాగుంటుంది.
– గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీడీఓ, మిర్యాలగూడ