మిర్యాలగూడ, ఏప్రిల్ 27 : మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులపై హస్తం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తోపాటు మరో 12 మంది కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, స్థానిక నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు.
చేరికలపై అధిష్టానాన్ని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుల అనుమతి లేకుండా ఎలా చేర్చుకుంటారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డ తిరునగరు భార్గవ్, అతని అనుచరులను ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల కారణంగానే అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ వచ్చిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తిరునగరు భార్గవ్, అతని అనుచరుల అవసరం ఏముందని చెప్పారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి వచ్చి పదవులు అనుభవించడం, దోచుకోవడం, అనుచరులకు దోచిపెట్టడం వారి నైజం అని ఆరోపించారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కావాలని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుమతితోనే పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం చెప్పడంతో రెండు నెలలుగా తర్జనభర్జన పడుతున్నారు. ఇటీవల ఓ కాంగ్రెస్ నాయకుడి అండతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షికి సమాచారం అందించిన మున్సిపల్ చైర్మన్ భార్గవ్తోపాటు మరో 12 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. శనివారం హుటాహుటిన భార్గవ్ అతని అనుచరులు గాంధీభవన్కు చేరుకున్నారు.
దీపాదాస్ మున్షి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, స్థానిక నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అందరూ భార్గవ్ను పార్టీలోకి తీసుకోవద్దని ఏకగ్రీవ తీర్మానం చేశారు. వారు రావడం వల్ల పార్టీ బలోపేతం కావడమేమోగానీ, పార్టీలో కుమ్ములాటలు ఉంటాయని తెలిపారు. కాగా డీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే అనుమతి లేకుండా చేరికలు చెల్లుబాటు కావని, భార్గవ్ అతని అనుచరుల చేరికలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్ మిర్యాలగూడ ఎమ్మెల్యేకు ఫ్యాక్స్లో ఒక లెటర్ను పంపించారు.
తిరునగరు భార్గవ్, అతని అనుచరులు ఇంతకాలం గుంటనక్కల్లాగా దోచుకుతిన్నారని, అభివృద్ధి చేయకుండా వ్యక్తిగత సంపాదనలు చేసుకున్నారని ఆరోపిస్తూ పలు వార్డుల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలకు చెప్పులు కట్టారు. కొంతమంది మహిళలు ఫ్లెక్సీలను చెప్పులు, పేడతో కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చేరికలు మిర్యాలగూడ కాంగ్రెస్లో చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.