చౌటుప్పల్ రూరల్, జనవరి 2 : చౌటుప్పల్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ. 80 లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది. మంగళవారం 11.30 గంటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సెంటర్ను ప్రారం భించనున్నారు. ఇప్పటికే డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. దవాఖానలోని ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి సేవలు త్వరితగతిన అందించేందుకు సన్నహాలు చేపట్టింది. నేటి నుంచి చౌటుప్పల్ ప్రాంత రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మూడు మండలాల్లో కిడ్నీ రోగులకు…
ఈ కేంద్రం ప్రారంభంతో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్పోచంపల్లి మండలాల కిడ్నీ రోగులకు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యాధునిక యంత్రాలతో కిడ్నీ బాధితులకు వైద్యసేవలు అందించనున్నారు. మూడు మండలాల పరిధిలో సుమారు 300మందికిపైగా కిడ్నీ రోగులు ఉండగా ప్రతి ఒక్కొ బాధితుడికి 10సార్లు రక్తశుద్ధి చేసుకోవాలి. దాంతో వైద్యం, ప్రయాణ ఖర్చులు కలిపి రూ. 40 వేలకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇక నుంచి రోగులకు ఆర్థిక భారం ఉండదు.
ఇక్కడి సెంటర్లో ఒకేసారి ఐదుగురికి రక్తశుద్ధి చేసేందుకు యంత్రాలను సిద్ధం చేశారు. దాంతో ప్రతిరోజు 20 మందికి డయాలసిస్ చేయనున్నారు. రేపటి నుంచి ఈ సెంటర్లో 24 గంటలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మూడు షిప్టుల్లో ఒక డయాలసిస్ టెక్నీషియన్, మరో 9 మంది టెక్నీషియన్లు సేవలు అందించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు
పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్స నేపథ్యంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు ఏర్పాట్లను పరిశీలించారు. దవాఖాన అవరణలో పనులను పర్యవేక్షించి వైద్యులతో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్రెడ్డి, కౌన్సిలర్ బాబాషరీఫ్, వైద్యులు అలివేలు, పాండురంగం పాల్గొన్నారు.