నల్లగొండ ప్రతినిధి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను రెండేండ్లలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీగా చర్చిస్తూ పనులు త్వరగా పూర్తి చేసేలా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
జిల్లాకు చెందిన ఉత్తమ్కుమార్రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండడం ప్రజల అదృష్టమని చెప్పారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాల్వల పనులతోపాటు పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ కాల్వల నిర్వహణపై దృష్టి సారిస్తూ మరమ్మతులు చేపట్టాలన్నారు. బెడ్ మరియు సైడ్స్ లైనింగ్ పనులను ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద మొదటి దశలో 50వేల ఎకరాలకు, రెండో దశలో మరో 50 వేల ఎకరాలకు సంబంధించిన భూ సేకరణతోపాటు కాల్వ తవ్వకాల పనులను పూర్తి చేసి లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉదయ సముద్రం మొదటి దశ భూ సేకరణకు సుమారు రూ.100 కోట్లు, పనులకు మరో 100 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పట్ల సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కావల్సిన సహకారం అందిస్తామని చెప్పారని వివరించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సెక్రెటరీ రాహు ల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్రావు, చీఫ్ ఇంజినీర్ అజయ్కుమార్, డిప్యూటీ ఈఎన్సీ జనరల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.