ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు ప్రగతి సాధిస్తున్నాయని, నకిరేకల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధికి బీఆర్ఎస్నే మరోసారి గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చేది లేదు… ఇక్కడ దాంతో అయ్యేది కూడా ఏమీ లేదని స్పష్టం చేశారు. శుక్రవారం వారు కట్టంగూరు మండలం అయిపాముల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి నకిరేకల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నకిరేకల్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించే బాధ్యత బీఆర్ఎస్ సర్కారుదేనన్నారు. కంటి ముందు అభ్యర్థిని, ఇంటి ముందు జరిగిన అభివృద్ధిని చూడండని, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండని పిలుపునిచ్చారు. గతంలో నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో కూలీ దొరక్క ఆంధ్రా ప్రాంతానికి వలసలు పోయేటోళ్లని, ఇప్పుడు గుంటూరు నుంచి పత్తి ఏరేందుకు ఇక్కడికొస్తున్నారని ఇందతా ఎట్లా సాధ్యమైందో ఒక సారి ఆలోచించాలని కోరారు. పుష్కలంగా నీళ్లు, 24 గంటల కరెంట్తో పంటల విస్తీర్ణం పెరిగి నేడు నల్లగొండ దేశానికి ధాన్యాగారంగా మారిందని తెలిపారు. బత్తాయి, నిమ్మ మార్కెట్ నాడు కాంగ్రెస్ హయాంలో ఎందుకు తేలేదో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణానదిలోకి నీళ్లొస్తే బ్రాహ్మణవెల్లంల రిజర్వాయర్ను నింపుతామని, అయిటిపాముల లిఫ్ట్తోనూ బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.
– నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : నకిరేకల్లో అభివృద్ధి కొనసాగాలన్నా, మరిన్ని కార్యక్రమాలు జరగాలన్నా, జరుగుతున్న పనులు వేగంగా పూర్తి కావాలన్నా మరోసారి బీఆర్ఎస్నే గెలిపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి ప్రజలను కోరారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధిలో స్పష్టమైన తేడా కనిపిస్తుందని, అది సంపూర్ణం కావాలంటే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మరోసారి అసెంబ్లీకి పంపాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత బీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. కట్టంగూరు మండలంలో ఐటిపాముల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడంతో పాటు నకిరేకల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం వారు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నకిరేకల్లో నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కంటి ముందు అభ్యర్థి, ఇంటి ముందు జరిగిన అభివృద్ధిని చూసి పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.
‘గతంలో నకిరేకల్కొస్తే సన్నని గుంతలమయమైన రోడ్లు చూశాం. ఇప్పుడు వస్తుంటే నాలుగు లైన్లతో బ్రహ్మండంగా వేస్తున్నారు’ అని పేర్కొన్నారు. డిగ్రీ కళాశాల, రూ.36కోట్లతో 100 పడకల ఆస్పత్రి, మరో రూ.36కోట్లతో నాలుగు లైన్ల రోడ్లు, రామన్నపేటలో 50పడకల ఆస్పత్రి ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. నకిరేకల్లో అభివృద్ధి స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. ‘మీ ఎమ్మెల్యే పట్టుబట్టి ఇవన్నీ దగ్గరుండి చేస్తున్నడు’ అని తెలిపారు. ఇక్కడి ప్రజల స్పందన చూస్తుంటే మరోసారి నకిరేకల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో కూలీ దొరకక ఆంధ్రా ప్రాంతానికి వలస పోయేటోళ్లని, ప్రస్తుతం గుంటూరు నుంచి పత్తి ఏరేందుకు ఇక్కడికొస్తున్నరని తెలిపారు. వరి నాట్ల కోసం చత్తీస్ఘడ్ నుంచి మగ కూలోళ్లు వస్తున్నారని, ఇందతా ఎట్లా సాధ్యమైందో ఒకసారి ఆలోచించాలని సూచించారు. సీఎం కేసీఆర్ వచ్చాక మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసిండ్రు. ప్రతి వాగు మీద చెక్డ్యాంలు కట్టిండ్రు, మోటార్లు కాలకుండా… ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంటు ఇస్తుండ్రు. ఎరువు కొరత లేదు. కరెంటు కొరత లేదు. అందువల్లనే ఈ రాష్ట్రం దేశానికి ధాన్యగారమైతే, నల్లగొండ రాష్ర్టానికి దండిగా ధాన్యం ఇస్తుందన్నారు.
కాంగ్రెసోళ్లకు ప్రజల సోయేది?
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెసోళ్లకు పదవుల మీద, పైరవీల మీద, వాళ్ల కడుపు నింపుకొనే అలోచనల మీద తప్ప ప్రేమ ప్రజల మీద లేదని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి పేరు పెద్దదే గానీ వాళ్ల పని చిన్నదని ఎద్దేవా చేశారు. ఇదే నకిరేకల్లో నిమ్మకాయల మార్కెట్ కావాలంటే సీఎం కేసీఆర్నే పెట్టిండని తెలిపారు. ఇదే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అడిగితే పట్టించుకోలేదని, మీరైనా నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టాలని అడిగితే వెంటనే ఇరిగేషన్ శాఖ భూమి ఇచ్చి కోట్ల రూపాయలతో మార్కెట్ పెట్టామని తెలిపారు.
బ్రాహ్మణవెల్లెంల నింపుతాం
త్వరలో కృష్ణా నదిలోకి నీళ్లొస్తే బ్రాహ్మణవెల్లంల రిజర్వాయర్ను నింపే కార్యక్రమం చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లింగయ్య ఇంకా కొన్ని కాల్వలు చేయాలే.. కొన్ని డబ్బులు కావాలి కోరినట్లు తెలిపారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు కాల్వలకు డబ్బులు ఇచ్చి పనులు పూర్తి చేస్తామన్నారు. రూ.100కోట్లతో అయిటిపాముల లిప్టుతోనూ నకిరేకల్కు నీళ్లు వస్తాయని, దీంతో నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు నీరందిస్తామన్నారు.
ప్రజల మనిషి చిరుమర్తి
‘మీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజల మనిషి. ఈ రోజుకు ఆయనకు హైదరాబాద్లో ఇల్లు లేదు. హైదరాబాద్లో క్వాటర్ ఇస్తే నాకొద్దు…. నేను అసెంబ్లీకి నకిరేకల్ నుంచే వస్తా… అసెంబ్లీ అయిపోయినాక నకిరేకల్కే పోతా… నా ప్రజల మధ్యనే ఉంటా అని చెప్పిన వ్యక్తి మీ ఎమ్మెల్యే లింగయ్య’ అని మంత్రి హరీశ్రావు చెప్పారు. పేదల ఆపద సాపదల్లో… కష్టసుఖాల్లో… నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిని మరోసారి ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించాలని కోరారు. నకిరేకల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తాను, జగదీశ్రెడ్డి కలిసి సంపూర్ణమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోరిక మేరకు సీఎం దృష్టికి తీసుకెళ్లి నకిరేకల్కు ప్రత్యేక కోటా కింద మరిన్ని ఇండ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కంచర్ల రామకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న, మున్సిపల్ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్, కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే చిరుమర్తి లక్ష్యం
నకిరేకల్, సెప్టెంబర్ 29 : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాడని, తనకంటే ఎక్కువగా ప్రగతిభవన్కు తిరిగి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాడని, ఇది ఇలాగే కొనసాగాలంటే మళ్లీ ఆయన్ని ఆశీర్వదించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. నకిరేకల్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలను శుక్రవారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చిరుమర్తి అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తుంటాడని, ఏదైనా పట్టుబడితే అది సాధించేంత వరకు వదలడని పేర్కొన్నారు. ప్రగతి భవన్లో ఆయా శాఖల మంత్రులను కలిసి అభివృద్ధి నిధులు కావాలని వెంట పడి మరీ తెచ్చుకుంటాడని తెలిపారు. ఇలాంటి నాయకుడుని గెలిపించుకుంటే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. బ్రాహ్మణవెల్లెంల ట్రయల్ రన్ సక్సెస్లో ఎమ్మెల్యే చిరుమర్తి ఎంతో కృషి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు.
ఆశీర్వదిస్తే.. అభివృద్ధిని కొనసాగిస్తా
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాలకు వచ్చానని, ప్రజాసేవకే తన జీవితం అంకితమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. నకిరేకల్ పట్టణంలో రూ.32కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నామని, దీంతో నియోజకవర్గంతో పాటు పలు మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. రూ.26కోట్లతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం, రూ.20కోట్లతో అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నామని, రూ.5కోట్లతో వెజ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం, మరో రూ.5 కోట్లతో మినీట్యాంక్బండ్ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. దాదాపు రూ.100 కోట్లతో నకిరేకల్ పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు మరోసారి తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగిస్తానని తెలిపారు.
ప్రజల మనిషి చిరుమర్తి
‘చిరుమర్తి లింగయ్య ప్రజల మనిషి. ఈ రోజుకు కూడా ఆయనకు హైదరాబాద్లో ఇల్లు లేదు. హైదరాబాద్లో క్వార్టర్ ఇస్తే వద్దన్నాడు. అసెంబ్లీకి నకిరేకల్ నుంచే వస్తానన్నాడు. పేదల కష్టసుఖాల్లో నిత్యం అందుబాటులో ఉంటాడు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం సీఎం, మంత్రులను ఎప్పుడూ కలుస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరింత అభివృద్ధిని సాకారం చేసుకోవాలి’.
– నకిరేకల్ సభలో మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి