నందికొండ, ఏప్రిల్ 06 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా – తథా ప్రజా అంటూ రాష్ట్రంలో మంత్రులు పోటీపడి దోచుకుంటుంటే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. దీనిని అడ్డుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. సోమవారం నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో విచ్చలవిడిగా గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, బెట్టింగ్ నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ దందాలను అరికట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల తరఫున నిలబడి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అనుముల మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ చెన్ను సుందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ హిరేకార్ రమేష్,7వ వార్డు ఇన్చార్జి సయ్యద్ మక్సూద్, 9వ వార్డు ఇన్చార్జి బత్తుల శేఖర్ బాబు, 10వ వార్డు ఇన్చార్జి కోడా విజయ్, 2వ వార్డు ఇన్చార్జి మహమ్మద్ గని, మాజీ వైస్ చైర్మన్ ఆదాసు విక్రమ్, పార్టీ నాయకులు అర్జున్ నాయక్, శివ, మహేశ్ నాయక్, మన్సూర్, నజీర్, రవి, నజీర్, షరీఫ్ పాల్గొన్నారు.