సూర్యాపేట రూరల్/బొడ్రాయిబజార్, మార్చి 9 : మహిళలు, బాలలపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీ పక్కన పోలీస్ శాఖ, సువెన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాన్ని శనివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
వేధింపులు, లైంగిక దాడులు, నిరాదరణకు గురైన బాధిత మహిళలు, పిల్లలకు ఒకే చోట కేసు నమోదు చేయడంతోపాటు వైద్య, న్యాయ, మానసిక ధైర్యం, పిల్లలకు విద్యా వసతి, పునారావసం, కౌన్సెలింగ్, కోర్టుల విషయాలు ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని అన్నారు. భరోసా సెంటర్ను ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, భాగస్వామ్యమైన సువెన్ఫార్మా ట్రస్ట్ను మంత్రి అభినందించారు. భరోసా సెంటర్, షీటీమ్స్ పని తీరు చట్టాల అమలుపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. గంజాయి రవాణా, అమ్మకాలను నిరోధించడంలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖాన ఆవరణలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. సర్వే నంబర్ 765, 766లో 5 ఎకరాల 8.5 గుంటల స్థలంలో రూ 190.50కోట్లతో చేపట్టే సూపర్ స్నెషాలిటీ ఆస్పత్రి, టీచింగ్ ఆస్పత్రి పనులను సత్వరమే చేపట్టాలని డీజేపీఆర్ కన్స్ట్రక్షన్స్ అధిపతి శశిభూషణ్, సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. ఆస్పత్రి పరిసరాలను కలియ తిరిగి పరిశీలించారు. పక్కనే ఉన్న పాత పాలిటెక్నిక్ కళాశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని, జిల్లాలో అన్ని ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా అలాగే మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఏఎస్పీలు నాగేశ్వర్రావు, జనార్దన్రెడ్డి, డీఎస్పీ రవి, డీఎంహెచ్ఓ కోటాచలం, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్రెడ్డి, ఈఈ ఎంఏ అజీజ్, తాసీల్దార్ శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, నాయకులు కొప్పుల వేణారెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, కౌన్సిలర్ పద్మ పాల్గొన్నారు.