ఉమ్మడి జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్టుల తాజా పరిస్థితి, పనుల నిర్వహణ, అనుమతులు, ఆర్థిక అవసరాలపై ప్రధానంగా చర్చించారు. జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల వారీగా సమగ్ర నివేదిక రూపొందించాలని ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ నివేదిక అనంతరం త్వరలోనే ప్రాజెక్టుల వారీగా మరోసారి పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, జిల్లా ప్రాజెక్టులపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఓ నివేదికను మంత్రులకు అందజేశారు.
అందులో ప్రస్తుత స్థితి, చేసిన ఖర్చు, నిధుల అవసరాలు, ప్రాజెక్టుల ప్రాధాన్యతల గురించి ప్రస్తావించారు. గురువారం సాయంత్రం సచివాలయంలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార చాంబర్లో జరిగిన సమావేశానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్14(నమస్తే తెలంగాణ) : బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ఈఎన్సీతోపాటు రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొని ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత పరిస్థితిని వివరించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత వివరించారు. ప్రాజెక్టుల పురోగతి, వెచ్చించిన నిధులు, ఇంకా నిధుల అవసరాలపై వాస్తవ పరిస్థితులను అధికారులు తెలియజేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా సంబంధిత అధికారులు సమగ్ర నివేదికలను త్వరలోనే అందజేయాలని స్పష్టం చేశారు. దీన్ని బట్టే ప్రభుత్వం నుంచి జరగాల్సిన కృషిపై స్పష్టత వస్తుందన్నారు. త్వరలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మరోసారి రివ్యూ ఉంటుందని చెప్పారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జిల్లా ప్రాజెక్టులపై తన వద్ద ఉన్న సమాచారంతో ఈ సందర్భంగా ఓ నివేదికను మంత్రులకు అందజేశారు. ఇందులో ప్రస్తుత స్థితి, చేసిన ఖర్చు, నిధుల అవసరాలు, ప్రాజెక్టుల ప్రాధాన్యతల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులను ఆపకుండా పూర్తి చేయాలని కోరారు.
పురోగతలో ఉన్న డిండి ఎత్తిపోతల, ఉదయసముద్రం-బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, నకలగండి రిజర్వార్ల పనులకు ప్రాధాన్యతనిస్తూ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అలాగే పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనులపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరానికి తగ్గట్లు బడ్జెట్ కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమారకు సుఖేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి పనులు త్వరగా అయ్యేలా చూడాలని ఆయన కోరారు.
రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, వాటికి కావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న అనుమతులు, పునరావాసం, ఇతర ఇబ్బందుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులేవీ పెండింగ్లో ఉండవద్దంటూ, వాటికి కావాల్సిన అటవీ శాఖ అనుమతులు, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అయితే అధికారులు కూడా ప్రాజెక్టుల పూర్తికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అన్ని ప్రాంతాల ప్రజల అవసరాలకు సమ ప్రాధ్యామిచ్చేలా అధికారులు వ్యవహరించాలన్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, ఉదయసముద్రం పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని ఆయన ఇరిగేషన్ ఈఎన్సీని అడిగి వివరాలు సేకరించారు. ఉదయసముద్రం ఎత్తిపోతల పథకంలో మిగిలి ఉన్న 10 శాతం పనులు పూర్తయితే లక్ష పైచిలుకు ఎకరాలకు సాగునీళ్లు అందుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో తాను, జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి, మండలి చైర్మన్, జిల్లా ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తామన్నారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తోపాటు జిల్లా ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వేముల వీరేశం, నలమాద పద్మావతి, కుందూరు జైవీర్రెడ్డి, మందుల సామేల్, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్కుమార్రెడ్డి, బాలూనాయక్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు .