తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతే గిరిజన జీవితాల్లో వెలుగులు వచ్చాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతున్నాయని రాష్ట్ర గిరిజన, సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేవరకొండ, కొండమల్లేపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో దేవరకొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావుతో కలిసి బీటీ రోడ్లు, గిరిజన పాఠశాలలు, కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపనలతోపాటు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, గిరిజనులే స్వయంగా పాలించుకునే అవకాశం కల్పించి వారి గుండెల్లో కేసీఆర్ దేవుడుగా నిలిచారని కొనియాడారు. దశాబ్దాలుగా అణచివేతకు, వెనుబాటుకు గురైన గిరిజనులు నేడు ఆత్మగౌరవంతో బతుకున్నారని, సర్కారు చేపడుతున్న కార్యక్రమాలే దీనికి కారణమని తెలిపారు. పెద్దఎత్తున సర్కారు విడుదల చేస్తున్న నిధులతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.కాంగ్రెస్ మోస పూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ , కర్ణాటక రాష్ర్టాల్లో పింఛన్ రూ.600 ఇస్తుంటే ఇక్కడ రూ.4 వేలు ఇస్తామని బూటకపు మాటలు చెప్పడంపై మండిపడ్డారు. పని చేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మరోసారి గెలిపించుకొని కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.
– దేవరకొండ/దేవరకొండ రూరల్/ కొండమల్లేపల్లి/దామరచర్ల/అడవిదేవులపల్లి, సెప్టెంబర్ 29
దేవరకొండ/ కొండమల్లేపల్లి/ దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 29 : దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్తో కలిసి రూ.126కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొండమల్లేపల్లి మండలంలో రూ.3.20 కోట్లతో కేశ్యాతండా నుంచి నాంపల్లి పీడబ్ల్యూ బీటీ రోడ్డు వరకు చేపట్టే బీటీ రోడ్డు, రూ.1.50 కోట్లతో సాగర్ పీడబ్ల్యూ రోడ్డు, రూ.4.20 కోట్లతో గిరిజన గురుకుల పాఠశాల అదనపు గదులకు, రూ.5.20 కోట్లతో చేపట్టే గిరిజన కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. దేవరకొండ మండలంలోని కమ్మెనపల్లి గ్రామంలో రూ.4.20కోట్లతో నిర్మించిన గిరిజన బాలుర పాఠశాల, కళాశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. అనంతరం రూ.3.90కోట్లతో దేవరకొండ నుంచి మర్రి చెట్టుతండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన తండాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైబడి జనాభా ఉన్న 3,146 గిరిజన తండాలు, గూడెలు, చెంచు పెంటలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులే పాలించుకునే అవకాశం కల్పించిన దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పాలనా సౌలభ్యం కోసమే గ్రామగ్రామాన పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, డంపింగ్ యార్డులు నిర్మించారన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో తండాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.
సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు అత్మ గౌరవంగా బతికేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. గిరిజనులంతా ఐకమత్యంతో మెలిగి పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నదని, వాటిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఛత్తీస్ఘడ్, కర్ణాటక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రూ.600 పింఛన్ ఇస్తుంటే.. ఇక్కడ రూ.4వేలు ఇస్తామని చెప్తున్న బూటకపు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. పని చేసే ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కావాలా.. మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న ప్రతిపక్షాలు కావాలో ఆలోచించాలన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజన తండాలను పట్టించుకోలేదని విమర్శించారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని చెప్పారు. చింతపల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ భవన నిర్మాణానికి రూ.25లక్షలు, కొండమల్లేపల్లిలో గిరిజన భవనానికి రూ.50 లక్షలు, దేవరకొండలో గిరిజన భవనం అదనపు పనులకు కోటి రూపాయలు, నియోజకవర్గంలో గిరిజన తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి మరో కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మైనంపల్లి, మర్రిచెట్టు తండా మహిళలతో కలిసి సాంప్రదాయ దుస్తులతో మంత్రి ఆడిపాడారు.
అవ్వా.. పింఛన్ వస్తున్నదా..!
బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఒక వృద్ధురాలిని మంత్రి హత్తుకొని ఆప్యాయంగా పలుకరించారు. అవ్వా పింఛన్ వస్తుందా.. నెల నెలా తీసుకుంటున్నావా? అని అడిగారు. ఇందుకు ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ.. అమ్మా నెల నెలా పింఛన్ వస్తుంది. ప్రతి నెలా తీసుకుంటున్నానని సమాధానమిచ్చింది. ‘మాకు నెల నెలా పింఛన్, దసరాకు చీర ఇస్తున్న మా పెద్ద కొడుకు కేసీఆర్ కడుపు చల్లంగా ఉండాలి. మేము ఎవరి మీదా ఆధారపడాల్సిన పని లేకుండా చేసిండు. పింఛన్ డబ్బుతోనే బతుకుతున్నా.’ అని చెప్పింది.
గిరిజన శాఖ నుంచి అత్యధిక నిధులు
గిరిజన శాఖ నుంచి నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు మంజూరయ్యాయి. పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారు. ఏడు గురుకుల పాఠశాలలు, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుతో ఎంతో మంది గిరిజన, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది.
కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాసులు, ఆర్డీఓ శ్రీరాములు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాజ్కుమార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, ఎంపీపీలు వంగాల ప్రతాప్రెడ్డి, మాధవరం సునీత, బాణావత్ పద్మ, జడ్పీటీసీలు మారుపాకుల అరుణ, కేతావత్ బాలూనాయక్, సర్పంచులు రమావత్ జ్యోతి, రమావత్ అనిత, ఎంపీటీసీలు రమావత్ జగన్నాయక్, రమావత్ రాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక
దేవరకొండ పట్టణంలో మేరు సంఘం నాయకులు, కొండమల్లేపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 400 మంది మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్లో పెద్ద సంఖ్యలో చేరుతున్నారన్నారు. గత పాలకుల హయాంలో కరెంట్, నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. స్వరాష్ట్రంలో బీడు భూములు సైతం సాగులోకి రావడంతో రైతులు రాజులుగా బతుకుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు.