నకిరేకల్, డిసెంబర్ 17 : వచ్చే సంక్రాంతి పండుగ లోపు ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని, ఆగిపోయిన ప్రాజెక్ట్లను త్వరలోనే పూర్తి చేసుకుందామని తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విజయోత్సవ ర్యాలీని ఆదివారం నకిరేకల్ బైపాస్ పద్మానగర్ జంక్షన్ నుంచి నకిరేకల్ మెయిన్ సెంటర్ ఇందిరాగాంధీ సెంటర్ వరకు నిర్వహించారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంను కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ నకిరేకల్ ఎమ్మెల్యేగా వేముల వీరేశాన్ని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ స్కీముల్లో ఇప్పటికే 2 గ్యారంటీలను అందిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నకిరేకల్ పట్టణ రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇళ్లులేని వారందరికీ ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ మ్యానిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్,
రాష్ట్ర నాయకులు దైద రవీందర్, పూజర్ల శంభయ్య, నకిరేకల్ ఎంపీపీ శ్రీదేవీగంగాధర్రావు పాల్గొన్నారు.