రేపు నల్లగొండ, సూర్యాపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాకేంద్రాల పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఎన్నికల హామీలో భాగంగా నల్లగొండను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,200 కోట్లతో జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చేశారు. ఆ అభివృద్ధి పనుల్లో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా, మిగతా వాటిని జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మరో 912కోట్ల రూపాయల పనులకు శంకుస్థాన చేయనున్నారు.
స్థానిక యువతకు సాఫ్ట్వేర్ కొలువులు అందించేందుకు నల్లగొండ, సూర్యాపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్లను ప్రారంభించనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.577.77 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇమాంపేట సమీపంలో రూ.20 కోట్లతో నిర్మించిన 384 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం నల్లగొండ జిల్లాకు వస్తున్న సందర్భంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ సుమారు రూ.1200 కోట్లతో పట్టణ సుందరీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే పలు పనులు ప్రారంభం కాగా.. అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ మరో రూ.250 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మరో 663 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ప్రగతి నివేదక సభను నిర్వహించనున్నారు.
ప్రగతి సన్నాహక సమావేశం
మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్జీ కళాశాల మైదానంలో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నది. సభ విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి శుక్రవారం లక్ష్మీ గార్డెన్లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వార్డుకు ఇద్దరు నుంచి ముగ్గురు ముఖ్య నాయకులతో కమిటీలు వేశారు. గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీతో కలిపి కమిటీలు వేసి జన సమీకరణ ఏర్పాట్లపై చర్చించారు. సభ స్టేజీ ఏర్పాట్లను నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
వేగంగా ప్రారంభోత్సవాల కార్యక్రమాలు
నల్లగొండ పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల నేపథ్యంలో మిగిలి ఉన్న పనులను శరవేగంగా చేపడుతున్నారు. మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్టవర్ సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ పనులను ముమ్మరం చేశారు. మర్రిగూడ జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయడంతో విద్యుత్ కాంతులతో రోడ్లు ధగధగ మెరుస్తున్నాయి. డివైడర్లు, రోడ్లకు ఇరువైపులా ఫుట్పాత్కు రంగులు, డ్రైనేజీ పనులను మున్సిపల్ కమిషనర్ రమణాచారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నల్లగొండ అభివృద్ధి ఫలాలు ప్రజలకు తెలిసేలా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. క్లాక్టవర్ నుంచి బస్టాండ్ వరకు మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం పర్యటించనున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో పాత కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్ను ప్రారంభించడంతోపాటు రూ.577.77 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సూర్యాపేట పట్టణంలో నలుదిక్కులా నిర్మితమైన భవనాలతోపాటు శంకుస్థాపనలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇమాంపేట సమీపంలో రూ.20కోట్లతో నిర్మించిన 384 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించనున్నారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రూ.4కోట్లతో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్, జమ్మిగడ్డ పుల్లారెడ్డి చెరువు సమీపంలో రూ.118 కోట్లతో నిర్మించిన మురుగు నీటి శుద్ధి కేంద్రం, ఇమాంపేట వద్ద రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన మానవ మల వ్యర్థాలతో ఎరువుల తయారీ కేంద్రం, రూ.2కోట్లతో నిర్మించిన ధోబీఘాట్లను మంత్రులు ప్రారంభిస్తారు. అలాగే రూ.30కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రారంభించబోయే భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవాలతోపాటు పట్టణంలో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లపై మంత్రి జగదీశ్రెడ్డి శనివారం సమీక్షించారు. అలాగే జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. ప్రారంభోత్సవాల సందర్భంగా మంత్రులకు ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీలు చేపట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు సమాయత్తమవుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొని మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పిలుపునిచ్చారు.