తుంగతుర్తి ప్రగతి నివేదన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఊహించిన దాని కంటే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎటూ చూసినా జన ప్రభంజనం కనిపించింది. మధ్యాహ్నం నుంచి మొదలైన జన ప్రవాహం సాయంత్రం సభ ముగిసే వరకు కొనసాగుతూనే ఉంది. తుంగతుర్తి నియోజకవర్గం నలుమూలల నుంచి తిరుమలగిరికి చేరుకునే రహదారులన్నీ గులాబీ సైనికులతో కిక్కిరిసిపోయాయి. చేతిలో పెద్దపెద్ద గులాబీ జెండాలు, మెడలో కండువాలు కళకళలాడాయి. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సారథ్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములై ఉత్సాహం నింపింది. ‘ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి. తమ్ముడు కిశోర్ ఎమ్మెల్యే కావాలి’ అంటూ సభ వేదిక మీదినుంచి మంత్రి కేటీఆర్ ఆకాంక్షించడంతో ప్రాంగణమంతా కేరింతలతో దద్దరిల్లింది. నల్లగొండ జిల్లా కేసీఆర్ ఖిల్లా అంటూ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేయగా, వెనుకబడిన తుంగతుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీలకు రూ.10కోట్ల చొప్పున రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అంతకుముందు తిరుమలగిరి మున్సిపాటీలో రూ.52 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు.
– నల్లగొండ ప్రతినిధి/సూర్యాపేట, జూన్29(నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి/ సూర్యాపేట, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన తుంగతుర్తి ప్రగతి నివేదన సభకు ప్రజలు పబ్బతి పట్టారు. ఈ సభకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన మంత్రులు నేరుగా తిరుమలగిరికి చేరుకున్నారు. వారికి ఎమ్మెల్యే కిశోర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అక్కడ మున్సిపాలిటీ కార్యాలయ నూతన భవనంతో పాటు రూ.80కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంలో భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
మధ్యాహ్నం రెండు గంటల నుంచే తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తిరుమలగిరి బాటపట్టారు. సాయంత్రానికి తిరుమలగిరి పట్టణం గులాబీమయంగా మారింది. ఎటుచూసినా చేతిలో బీఆర్ఎస్ జెండా, మెడలో గులాబీ కండువాలు ధరించిన వారే కనిపించారు. ఓపెన్ టాప్ వాహనంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ఉన్న జనంతోపాటు రోడ్డు పక్కన ఉన్న ఇండ్లపైకి ఎక్కిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ర్యాలీ చేరుకునే సరికే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సూర్యాపేట – జనగాం హైవే పక్కనే ఏర్పాటు చేసిన సభా స్థలంతోపాటు బయట వేలాది మంది జనంతో జన ప్రభంజనాన్ని తలపించింది. సభా ప్రాంగణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జనంతో నిండిపోయాయి. మంత్రులు సభా వేదికపైకి చేరుకునే సమయంలో ఒక్కసారిగా సభలో కేరింతలు, ఈలలతో జై కేసీఆర్.. జై కేటీఆర్.. జై కిశోరన్న అంటూ నినాదాలు హోరెత్తాయి. సభా ప్రాంగణం నిండిపోవడంతో స్థలం లేక ప్రజలు రోడ్లపైనే నిలబడి నేతల ప్రసంగాలు వింటూ కనిపించారు.
యువత ప్రత్యేక ఆకర్షణ
‘మీ ఉత్సాహం చూస్తుంటే ప్రగతి నివేదన సభ లెక్క లేదు. కాంగ్రెస్, బీజేపీలను పచ్చడి పచ్చడి చేసే సభలాగా ఉన్నది. ఎవరన్నా పోటీ చేయడానికి భయపడేట్లు. ముఖ్యంగా మా తమ్ముళ్ల ఉత్సాహం చూస్తుంటే వాళ్లు అసలు పోటీ కూడా బంద్ చేసుకుని హైదరాబాద్లోనే ఉండి పోతారేమో’ అంటూ మంత్రి కేటీఆర్ తన ప్రసంగం ఆరంభంలో చేసిన వ్యాఖ్యలు సభకు ఏ విధంగా యువత తరలివచ్చారో స్పష్టం చేస్తోంది. ప్రగతి నివేదన సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభకు వచ్చిన గులాబీ దండులో యువతే ఎక్కువగా కనిపించడం విశేషం. మంత్రి కేటీఆర్ ర్యాలీలోనూ యువత కదం తొక్కారు. సభా ప్రాంగణంలోనూ వారి సంఖ్య గణనీయంగా కనిపించింది. వేదిక ముందు భాగంలో వారి సందడి అంతా ఇంతా కాదు. కిశోర్ ప్రసంగ సమయంలోనూ, కేటీఆర్ ప్రసంగిస్తుంటే కేరింతలు, ఈలలు, నినాదాలతో హోరెత్తించారు. తమ్ముడు కిశోర్ను మూడోసారి ఎమ్మెల్యే చేయాలని మంత్రి కేటీఆర్ అన్నప్పుడు పెద్ద ఎత్తున స్పందన లభించింది.